
విత్తు కొద్దీ పంట
జాగ్రత్తలు వహించాలి
విత్తన ఎంపికలో రైతులు అత్యంత జాగ్రత్తలు వహించాలి. ఇప్పటికే రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. పంట కాలువలకు పూర్తి స్థాయిలో నీరు వచ్చిన అనంతరం వెదజల్లు సాగుకు కూడా ప్రాధాన్యమివ్వాలి. ముందస్తు సాగు చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
– కొప్పిశెట్టి ప్రభాకర్,
మండల వ్యవసాయాధికారి, రాయవరం
రాయవరం: వ్యవసాయ అవసరాలకు ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన నీరు విడుదల చేసినట్టు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. పూర్తి స్థాయిలో పొలాలకు నీరు రావడానికి వారం రోజులు పట్టే అవకాశముంది. ఈలోగా వ్యవసాయ బోర్లు ఉన్న రైతులు ఇప్పటికే వరి నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలను వినియోగిస్తుండగా, మరికొందరు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్లో అధికంగా రైతులు స్వర్ణ రకాన్ని సాగు చేస్తారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైతులు విత్తన ఎంపికకు అధిక ప్రాధాన్యమివ్వాలని, విత్తనం ఎంపికపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 1,63,365 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
నాలుగు రకాల్లో..
నాణ్యమైన విత్తనాలు బ్రీడర్, ఫౌండేషన్, సర్టిఫైడ్, ట్రూత్ఫుల్ లేబుల్స్లో లభ్యమవుతాయి.
బ్రీడర్ విత్తనం
న్యూక్లియర్ సీడ్ మూల విత్తనం నుంచి బ్రీడర్ విత్తనాన్ని తయారు చేస్తారు. ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పర్యవేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు రూపొందించేవి ఇటువంటి విత్తనాలే. ఈ విత్తనం 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి బ్రీడర్ సీడ్ ఇవ్వరు.
ఫౌండేషన్
ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. దాదాపు 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకుని వెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు.
సర్టిఫైడ్(ధ్రువీకరించిన)
విత్తనం నుంచి నేరుగా సర్టిఫైడ్ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో కూడా విత్తన పర్యవేక్షకుల సమక్షంలో పండించే అవకాశం ఉంది. ఈ విత్తనానికి నీలి రంగు ట్యాగ్ వేస్తారు. ఏపీ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా సర్టిఫై చేస్తారు.
ట్రూత్ఫుల్ లేబుల్
ఈ విత్తనాలను ట్రూత్ఫుల్ లేబుల్ కింద రైతులకు విత్తన కంపెనీలు విక్రయిస్తుంటారు. ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనాలకు ఆకుపచ్చ రంగు ట్యాగ్ వేస్తారు. లేబుల్ ట్యాగ్పై విత్తన పరీక్ష చేసిన తేదీ ఉంటుంది. ఆ తేదీ నుంచి తొమ్మిది నెలల కాల పరిమితిలోపు విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు.
నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి
పంట దిగుబడిలో మొలక శాతం కీలకం
విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు
పాటించాలంటున్న వ్యవసాయ నిపుణులు
పాటించాల్సిన సూచనలివే..
వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.
బిల్లుపై నంబరు, విత్తన రకం, గడువు తేదీలు, డీలరు సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి.
లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయరాదు.
గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయకూడదు.
కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్లపై సీలు ఉందో లేదో చూసుకోవాలి.
కొన్న విత్తనాలను డీలరు వద్దే తూకం వేయించాలి.
వేసవి దృష్ట్యా ప్రతి రైతు తప్పనిసరిగా మొలక శాతం పరీక్ష చేయాలి.
100 గింజలకు 80 గింజలు మొలక వస్తే నాణ్యమైన విత్తనంగా పరిగణించవచ్చు.
మొలక శాతం తక్కువగా ఉన్నట్లు రైతులు గుర్తిస్తే వెంటనే వేరే లాట్ నంబర్ నుంచి విత్తనాన్ని పొందే అధికారం వారికి ఉంది. దీనికి వ్యవసాయాధికారులు కూడా సహకరిస్తారు.
మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
కొనుగోలు చేసిన విత్తన బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలి.
అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినా సరే బిల్లు తీసుకోవాలి.

విత్తు కొద్దీ పంట

విత్తు కొద్దీ పంట

విత్తు కొద్దీ పంట