
ఇద్దరు లారీ డ్రైవర్ల దుర్మరణం
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం కాపవరం వద్ద హైవే పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. కొవ్వూరు ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ బత్తుల శీనయ్య(40) హైదరాబాద్ నుంచి మండపేటకు ధాన్యం లోడుతో వస్తున్నాడు. కాపవరం వద్దకు వచ్చే సరికి కునుకుపాటుకు గురై ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం రోడ్డు డివైడర్ను ఢీ కొట్టడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీని ఇతర వాహనాలకు ఢీకొనకుండా, శీనయ్య కిందకు దిగి డైరెక్షన్ ఇస్తూ దారి చూపుతున్నాడు. ఇంతలో జంగారెడ్డిగూడెం నుంచి ధాన్యం లోడుతో వస్తున్న మరో లారీ.. శీనయ్య లారీని బలంగా ఢీకొట్టడంతో అందులోని డ్రైవర్ కొయ్యే బాబూరావు(40) లారీ క్యాబిన్లో ఇరుకుపోయి మృతి చెందాడు. డైరెక్షన్ ఇస్తున్న బత్తుల శీనయ్య కూడా ఐచర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీహరి తెలిపారు.