
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
మునికూడలి ర్యాంపులో ఆగని ఇసుక రవాణా
సీతానగరం: జిల్లాలో 28 ఇసుక ర్యాంపులు నిలిపివేస్తున్నట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మునికూడలి ర్యాంపు నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మండలంలోని ములకల్లంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి కాటవరం ర్యాంప్ నుంచి, పక్కిలంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి మునికూడలి ర్యాంపు నుంచి, రఘుదేవపురం, వంగలపూడి ర్యాంపుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ర్యాంపులను అక్టోబర్ వరకు నిలిపివేస్తున్నట్లు, ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సోమవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పక్కిలంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి లారీలపై మునికూడలి ర్యాంపు నుంచి రవాణా చేస్తున్నారు. గోదావరి నదీ గర్భంలో మూడు భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి సమయంలో కూడా ఇసుక రవాణా జరుగుతోందని స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ను వివరణ కోరగా తక్షణమే ర్యాంపును నిలిపివేస్తామని తెలిపారు. అయితే మంగళవారం రాత్రి కూడా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిగాయి.