
ఏడాది కాలంలో ఏం పొడిచారు?
● ఫ్లెక్సీలు కట్టి డబ్బాలు కొట్టుకోవడం
తప్ప ఏం చేశారు?
● అసలు బాబూకొడుకులకేం తెలుసు?
● నా చరిత్ర తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు
● ఆదిరెడ్డి కుటుంబంపై గోరంట్ల ఫైర్
రాజమహేంద్రవరం రూరల్: ‘‘బుచ్చయ్య చౌదరి ఒక చరిత్ర. నా చరిత్ర తెలియనివారు ఏదో మాట్లాడుతున్నారు. రాజమండ్రి నగరం అభివృద్ధి నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఏడాది కాలంగా బాబూ కొడుకులు ఏం చేశారు? నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏడాదిగా ఏం పొడిచారు? ఫ్లెక్సీలు కట్టుకుని డబ్బాలు కొట్టుకోవడమే చేశారు. మోరంపూడి ఫ్లై ఓవర్కు ఏం చేశారని ఫ్లెక్సీలు కట్టుకున్నారు? నన్ను అవమానపరచాలంటే తాతలు దిగి రావాలి’’ అంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. నగరంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన సొంత పార్టీ టీడీపీకే చెందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటును ఆదిరెడ్డి వాసు తన ఘనతగా చెప్పుకోవడంపై మండిపడ్డారు. తెలుగు విశ్వ విద్యాలయం భూముల కేటాయింపులో తాను భాగస్వామినని, రాష్ట్ర విభజన తరువాత తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడానికి కేసీఆర్ మొండికేశారని, దీని కోసం 2014–19 మధ్య అనేకసార్లు చంద్రబాబుతో తాను మాట్లాడానని చెప్పారు. వాసు వ్యవహారం చూస్తూంటే.. ఎవరో కన్న బిడ్డకు తాను తండ్రిగా చెప్పుకున్నట్లు ఉందని దుయ్యబట్టారు. సుబ్రహ్మణ్యం మైదానంలో సభ ఏర్పాటు చేసి, తాను చేసిన అభివృద్ధిని సవివరంగా చెబుతానని గోరంట్ల అన్నారు.
తారస్థాయికి చేరిన రాజకీయ వైరం
టీడీపీలో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య చిరకాలంగా నెలకొన్న రాజకీయ వైరం ప్రస్తుతం తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పార్టీకి అత్యంత కీలకమైన మహానాడుకు ముందే వారి మధ్య వైరుధ్యాలు వెలుగు చూశాయి. ఇన్నాళ్లూ నాయకులు, కార్యకర్తల మధ్యనే జరుగుతున్న వివాదం కాస్తా ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చింది. బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు మధ్య వివాదం నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో చెలరేగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పార్టీలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి జిల్లా స్థాయి మినీ మహానాడులో గోరంట్లకు జరిగిన అవమానంతో వీరిద్దరి వివాదం మరింత మురుదు పాకాన పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అందరి భాగస్వామ్యంతో
‘యోగాంధ్రప్రదేశ్’
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 27న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 1న సరస్వతీ ఘాట్ వద్ద, 7న కడియం సత్యదేవ నర్సరీ, 14న కొవ్వూరు గోష్పాద క్షేత్రం, 20న నగర వనంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయని వివరించా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా పోటీలు నిర్వహించి, జిల్లా స్థాయి విజేతలు వచ్చే నెల 21న విశాఖలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.