
తుల్యభాగ నదిలో దూకి విద్యాకమిటీ చైర్మన్ మృతి
కాజులూరు: గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్, మండల వర్తక సంఘ సభ్యుడు కొల్లుశెట్టి సత్యం (పలావు సెంటర్ స్వామి) కరప మండలం గొర్రిపూడి వద్ద తుల్యభాగ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సత్యం తన మోటారు బైక్తో వెళ్లి సెల్ఫోన్, చెప్పులు రోడ్డుపై వదిలి వంతెనపై నుంచి తుల్యభాగ నదిలోకి దూకాడు. ఆపై ఊపిరాడక కేకలు వేయడంతో సమీప కాలువ రేవులో దుస్తులు ఉతుకుతున్న మహిళలు, స్థానికులు ఎవరో నీటిలో దూకినట్టు గమనించి బైక్, సెల్ఫోన్ ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వెళ్లి సత్యం కోసం వెతికే ప్రయత్నం చేసినా రాత్రి కావడంతో అతని ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్యర్యంలో కాకినాడ రెస్క్యూ టీమ్ వచ్చి హై స్పీడ్ బోట్లతో కాలువను జల్లెడ పట్టారు. సాయంత్రం తణుకువాడ, గొర్రిపూడి గ్రామల సరిహద్దులో సత్యం మృతదేహం కనిపించింది. ఐదేళ్ల కిందట సత్యం కుమార్తె అనారోగ్యంతో చనిపోగా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. వీఆర్వో శవ పంచనామా అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందరితో కలిసిపోతూ వర్తక సంఘ నిర్వహణలో కీలకంగా వ్యవహరించే సత్యం అకాల మరణం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

తుల్యభాగ నదిలో దూకి విద్యాకమిటీ చైర్మన్ మృతి