
కార్మికుల గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్ సీపీ
రాజమహేంద్రవరం సిటీ: కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్ సీపీయేనని మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. కార్మిక శక్తి లేనిదే దేశాభివృద్ధి లేదన్నారు. మేడే సందర్భంగా భరత్రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు, సప్పా ఆదినారాయణ ఆధ్వర్యాన స్థానిక కోటగుమ్మం సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి డీలక్స్ సెంటర్ వరకూ కార్మికులతో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటగుమ్మం సెంటర్లో కార్మికులనుద్దేశించి భరత్రామ్ మాట్లాడుతూ, పేరులోనే ‘శ్రామిక’ ఇమిడి ఉన్న పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రెండున్నరేళ్లు కరోనాతో పోయిందని, మిగిలిన రెండున్నరేళ్లు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో చేయదగిన రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్పారు. ఒకప్పుడు వర్షం వస్తే వైద్యం చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రూ.100 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. అక్కడ సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకం వంటి విషయాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. విమర్శించడం కోసమో మరో దానికో కాకుండా గత జగన్ ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. అందరి ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జగన్ సీఎం అవుతారని భరత్రామ్ ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతమ్రెడ్డి మాట్లాడుతూ, పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు స్వయంగా చూసిన జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని చెప్పారు. పారిశుధ్య కార్మికుల జీతాలను రూ.9 వేల నుంచి రూ.20 వేలకు పెంచారన్నారు. అలాగే, ఆటో కార్మికులకు, దర్జీల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారన్నారు. చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.24 వేలు వేశారన్నారు. అందువల్లనే జగన్ హయాంలో కార్మిక ఉద్యమాలు లేవని చెప్పారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు.. కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కులమత వర్గాలకు అతీతంగా భరత్రామ్ నాయకత్వంలో మే 20న జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని గౌతమ్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు, వైఎస్సార్ సీపీ నగర నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, దాసి వెంకటరావు, సంకిస భవానీప్రియ, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఈఎస్ఐ ఆసుపత్రిని రూ.100 కోట్లతో అభివృద్ధి చేశా
ఫ సౌకర్యాల కల్పనకు ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపాలి
ఫ మాజీ ఎంపీ భరత్రామ్

కార్మికుల గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్ సీపీ