
వినియోగంలోకి సత్యదేవుని కొత్త నివేదన శాల
అన్నవరం: స్థానిక శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) నిర్మించిన నివేదనశాలలో ఎట్టకేలకు బుధవారం నుంచి నివేదనల తయారీ ప్రారంభించారు. ‘సాక్షి’దినపత్రికలో ఏప్రిల్ 25వ తేదీన ‘నిరుపయోగంగా నివేదనశాల’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అధికారులు స్పందించారు. ఈ నివేదనశాలలో భక్తులకు పంపిణీ చేసే పులిహోర, దద్దోజనం, ఇతర ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సత్యదేవునికి నివేదనలు, పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి, విడిపొంగలి వంటి ప్రసాదాలు తయారు చేసేందుకు స్వామివారి ఆలయానికి దిగువన కుడివైపు ఒక నివేదనశాల ఉంది. 2023లో భక్తులు వేచి ఉండేందుకు కంపార్ట్మెంట్ తరహాలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా ఆ నివేదనశాలను హాలులా అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ మార్చారు. దీంతో నివేదనలు తయారు చేసేందుకు రామాలయానికి ఎదురుగా గల సర్క్యులర్ మండపం మీద తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) రూ.30 లక్షల వ్యయంతో కొత్త నివేదన శాల నిర్మించి 2023 ఆగస్టు నెలలో దాత చేతుల మీదుగా ప్రారంభించారు. 2023 నవంబర్లో ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కాగా ఆయన స్థానంలో ప్రస్తుతం దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్గా వ్యవహరిస్తున్న కె.రామచంద్రమోహన్ ఈఓగా భాధ్యతలు స్వీకరించారు. పాత నివేదనశాలలోనే మళ్లీ నివేదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో పాత నివేదనశాలకు మార్పులు చేసి 2023 నవంబర్ నుంచి ఉపయోగిస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో ఏప్రిల్ 25న ‘నిరుపయోగంగా నివేదనశాల’ శీర్షికన కథనం ప్రచురితం కాగా దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించారు. కొత్త నివేదనశాలలో భక్తులకు పంపిణీ చేసే పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి తయారు చేయాలని ఆదేశించారు. దీంతో బుధవారం లాంఛనంగా అందులో నివేదనల తయారీ ప్రారంభించారు.

వినియోగంలోకి సత్యదేవుని కొత్త నివేదన శాల

వినియోగంలోకి సత్యదేవుని కొత్త నివేదన శాల