● అక్టోబరు ఒకటిన భోగాపురం
విమానాశ్రయం ప్రారంభం
● ప్రధాని సభ కోసం జిల్లా నుంచి వంద ఆర్టీసీ బస్సుల మళ్లింపు
● రెండు రోజుల పాటు
ప్రయాణిలకు ఇక్కట్లే!
సాక్షి, అమలాపురం: విజయనగరం జిల్లా భోగాపురంలో ఆగస్టు 1న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలనే పేరుతో టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున మళ్లిస్తుండటంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ రోజు ప్రధానమంత్రి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సభకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను కూడా వినియోగిస్తున్నారు. చంద్రబాబు ప్రచార యావ, కార్యకర్తల తరలింపునకు ప్రభుత్వ వనరులను వినియోగిస్తుండటంతో జూలై 31, ఆగస్టు 1 తేదీల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని రావులపాలెం, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం డిపోల పరిధిలో సుమారు 300 ఆర్టీసీ బస్సులు ఉండగా, వాటిలో దాదాపు 100 బస్సులను ప్రధాని సభకు కేటాయించినట్లు సమాచారం. వీటిలో సుమారు 30 బస్సులను ఇప్పటికే ఇతర జిల్లాలకు తరలించడం గమనార్హం. అమలాపురం డిపో పరిధిలో మొత్తం 130 బస్సులు ఉండగా, వాటిలో 40 బస్సులను సభకు వినియోగిస్తున్నారు. రామచంద్రపురం డిపోలో 52 బస్సులకు ఐదు ఇప్పటికే వినియోగంలో లేవు. మిగిలిన వాటిలో 20 బస్సులను సభ విధులకు కేటాయించారు. రావులపాలెం, రాజోలు డిపోల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిస్తున్నట్లు తెలిసింది.
వాడపల్లి భక్తులకు అవస్థలే!
అమలాపురం నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం మార్గాల్లో సాధారణంగా ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉండగా, ఈ రెండు రోజుల పాటు ఆ పరిస్థితి కనిపించదని ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా జూలై 31వ తేదీ శనివారం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని తెలుస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా శనివారం అదనపు బస్సులు అవసరమైన సమయంలో, ఉన్న బస్సులనే సభకు మళ్లించడం వల్ల ప్రయాణికులు అష్టకష్టాలు పడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అమలాపురం డిపోలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు


