అమలాపురం రూరల్: జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులు, రైతు నీటి సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఖరీఫ్ పంటకు సంబంధించి సాగు నీటి యాజమాన్యం, పంట కాలువల నిర్వహణ, నీటి విడుదల ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ప్రవాహం అధికంగా ఉన్నచోట నీటిని మళ్లించి, దిగువ ప్రాంతాలకు చేరేలా ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘ నాయకులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, ఇతర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
జిల్లాలో రీ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి, లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే పురోగతి, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, ఈకేవైసీ నమోదు, మ్యూటేషన్లు, సబ్డివిజన్ల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టరేట్లో సమీక్షించారు.
జిల్లాలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ పరిమితుల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ సంఘాల ఆర్థిక పరిస్థితి, నాబార్డ్ నిబంధనల మేరకు క్యాష్ క్రెడిట్ పునరుద్ధరణపై చర్చించారు.


