ఫ అదిరేలా ఆషాఢం సారె
అమలాపురం సుబ్బారాయుడి చెరువు సెంటర్లో వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు సోమవారం శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సీనియర్ న్యాయవాది కూచిమంచి మల్లపరాజు, నాగమణి, వారి కుమారుడు, మరో న్యాయవాది శశిధర్ శ్రీరామ్, సుజాత దంపతుల ఆధ్వర్యాన ఆ ప్రాంత మహిళలు అమ్మవారికి ఆషాఢం సారె వైభవంగా సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు సారెతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించి, అమ్మవారి సన్నిధిలో నివేదించారు. ఈ సంప్రదాయాన్ని ఇక నుంచి ఏటా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయంలో గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. – అమలాపురం టౌన్
ఫ పసుపు నీళ్లతో
బోనం వేడుక
ఆషాఢ మాసం సందర్భంగా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో గ్రామ దేవతలకు సోమవారం పసుపు నీళ్లతో బోనం వేడుక కోలాహలంగా నిర్వహించారు. రాజమహేంద్రవరానికి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యాన స్థానిక శ్రీ ఉమా మూలేశ్వరస్వామి ఆలయం నుంచి మహిళలు లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తూ ఊరేగింపు నిర్వహించి, బిందెలతో పసుపు నీళ్లు తెచ్చి బోనాలు సమర్పించారు. సమరసత సేవా ఫౌండేషన్ గోదావరి విభాగం మహిళా కన్వీనర్ పద్మశ్రీ, ధర్మ ప్రచారక్ మల్లేశ్వరరావు, మండల కో కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. – ఆలమూరు


