అమలాపురం టౌన్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్–396ని రద్దు చేయాలనే డిమాండుతో దస్తావేజు లేఖర్లు సోమవారం నుంచి పెన్డౌన్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న దశల వారీ ఆందోళనల్లో భాగంగా ఈ నిరసన చేపడుతున్నారు. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన దాదాపు 2 వేల మంది దస్తావేజు లేఖర్లు, సహాయకులు, టైపిస్టులు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి సురేష్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి వెలుతురుపల్లి సుబ్బు తదితరులు పట్టణ సీఐ పి.వీరబాబుకు, 1, 2 సబ్ రిజిస్ట్రార్లు ఆర్.శ్రీలక్ష్మి, పి.లక్ష్మణరాజులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ డిమాండుతో ఇప్పటికే దస్తావేజు లేఖర్లు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రెండు పర్యాయాలు ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెన్డౌన్ పిలుపు నేపథ్యంలో వారు సోమవారం నుంచి కక్షిదారులకు డాక్యుమెంటేషన్ చేయరు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎప్పటిలాగే జరుగుతుంది. అయితే, దస్తావేజు లేఖర్లు మాత్రం తమ విధులకు దూరంగా ఉంటారు.


