వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి
అల్లవరం: సెంట్రల్ డెల్టా పరిధిలో కాలువలకు సాగునీరు విడుదల చేసి నలభై రోజులు కావస్తున్నా నేటికీ ప్రధాన కాలువల్లో సాగునీరు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు జున్నూరి రామారావు మంగళవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాలువలు తెరిచే సమయానికి వంతెల నిర్మాణాలు చేపట్టి శివార్లకు సాగునీరు రాకుండా చేశారని ఆయన మండిపడ్డారు. అమలాపురం నియోజకవర్గంలో నేటికీ నారుమడులు వేయని దయనీయ స్థితి ఏర్పడిందన్నారు. జూన్ చివరి వారంలో పడాల్సిన నారుమడులు నేటికీ వేయలేదని, నియోజకవర్గంలోని మండలాల్లో సగానికి పైగా నారుమడులు పడలేదన్నారు. ఖరీఫ్కు వెళ్లాలా, పంట విరామం ప్రకటించాలా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారని రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద కూటమి పార్టీకి చెందిన రైతు నాయకులు నిరసన తెలిపారంటే అధికారుల నిర్లక్ష్యాన్ని అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. కలెక్టర్ స్పందించి శివార్లకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పంట విరామం ప్రకటించాలని డిమాండ్ చేశారు.


