ఐ.పోలవరం: ‘నారెండుతోంది’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనానికి ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు స్పందించారు. గ్రామాల్లో ఎండిపోతున్న వరి నారుమడులను మంగళవారం పరిశీలించారు. కేశనకుర్రు, జి.వేమవరం, తిల్లకుప్ప, టి.కొత్తపల్లి శివారు జి.మూలపాలెం తదితర గ్రామాల్లో మురమళ్ల పీఏపీ సెక్షన్ కింద ఇరిగేషన్ ఈఈ కాశీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఈఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండలంలో 6 వేల ఎకరాల్లో దమ్ములు పూర్తయినట్లు గుర్తించామన్నారు. నార్త్ అడ్డాల్ కాలువ సమీపాన 200, పంచాయతీ పరిధిలో 60, ఇతర గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో సాగునీరు అందడం లేదని గుర్తించినట్లు వివరించారు. ప్రస్తుతం 11.30 క్యూసెక్కులు విడుదల చేశామని, వారం రోజుల్లో పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


