అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీల పరిష్కారంలో జిల్లా 88.74 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఈ ఘనత సాధించడానికి జిల్లా స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన కృషి కారణమన్నారు. అలాగే ప్రజా సంతృప్తి స్థాయికి సంబంధించి 5 మార్కులకు 3.54 మార్కులను సాధించి ముందు వరుసలో నిలిచామన్నారు.
పన్నుల వసూలులో
అమలాపురం ఫస్ట్
అమలాపురం టౌన్: అమలాపురం మున్సిపాలిటీ 2025–26 సంవత్సరానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు మార్చి 31 నాటికి 80.52 శాతం మేర పన్నులు వసూలు చేసి జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కమిషనర్ వి.నిర్మల్ కుమార్ తెలిపారు. ముగింపు రోజు అయిన మార్చి 31న ఒక్క రోజే రూ.86 లక్షల మేర వసూలైందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీపై విస్తృత ప్రచారం, తమ మున్సిపాలిటీ రెవెన్యూ విభాగం సిబ్బంది క్షేత్ర స్థాయిలో చేసిన కృషితో ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ భూపతి శ్రీలక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాహుల్, బిల్లు కలెక్టర్లు, పట్టణంలోని 15 వార్డు సచివాలయాల అడ్మిన్లను కమిషనర్ నిర్మల్ కుమార్ అభినందించారు.
ఖతార్ నుంచి స్వదేశానికి..
అమలాపురం రూరల్: ఖతార్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప గ్రామానికి చెందిన మల్లాడి జయలక్ష్మిని కేసీఎం అధికారులు క్షేమంగా ఇంటికి చేర్చారు. ఆమె 2025 డిసెంబర్ 15న కుందుర్తి నాగరాజు అనే నకిలీ ఏజెంట్ ద్వారా ఖతార్ దేశానికి వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత రోజుకు సుమారు 18 గంటల పాటు పని చేయించుకోవడం, చిన్న విషయానికే అవమానించడం, తీవ్రంగా దూషించడం, పరిశుభ్రత విషయంలో అనవసర ఆరోపణలు చేయడం వంటి వేధింపులు ఎదుర్కొన్నారు. వాటిని భరించలేక ఇండియాకు వచ్చేద్దామని నిర్ణయించుకుని తన పిల్లల ద్వారా ఏజెంట్ సంప్రదించినా అతడు చేతులెత్తేశాడు. దీంతో కేసీఎం వలసదారుల కేంద్రాన్ని జయలక్ష్మి పిల్లలుసంప్రదించారు.
ఏకపక్షంగా
లేబర్ కోడ్ల అమలు
అమలాపురం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిన 4 లేబర్ కోడ్లను బుధవారం నుంచి ఏకపక్షంగా అమలు చేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక చింతపల్లి కృష్ణమూర్తి స్మారక స్థూపం వద్ద ధర్నా జరిగింది. ఆ సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ లేబర్ కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం సుదీర్ఘ కాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కె.చంద్రరావు, గూడాల వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


