పండగ బాదుడు మొదలు | - | Sakshi
Sakshi News home page

పండగ బాదుడు మొదలు

Dec 23 2025 6:59 AM | Updated on Dec 23 2025 6:59 AM

పండగ

పండగ బాదుడు మొదలు

సంక్రాంతి దోపిడీకి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిద్ధం

మూడు రెట్లు పెరిగిన బస్సు టిక్కెట్‌ ధరలు

ఈ నెల 9 నుంచి 13 వరకు...

హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆర్టీసీ టిక్కెట్‌లు లేవు

ప్రైవేట్‌ బస్సు సిటింగ్‌ టిక్కెట్‌ల ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు...

స్లీపర్‌ బస్సుల ధరలు

రూ. 2 వేల నుంచి రూ.మూడు వేల

ఈ నెల 18న కొండెక్కిన రిటన్‌ టిక్కెట్ల ధరలు

రైల్వేలో చాంతాడంత వెయిటింగ్‌ లిస్టు

పండగకు ప్రయాణమే పెద్ద ఖర్చు

సాక్షి, అమలాపురం: పండగ బాదుడుకు ప్రైవేట్‌ ఆపరేటర్లు సిద్ధమయ్యారు. రైల్వే టిక్కెట్‌ల వెయింటిగ్‌ లిస్టు చాంతాడంత ఉండడం... హైదరాబాద్‌ నుంచి వచ్చి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సు టిక్కెట్లు ఇప్పటికే కొనుగోలు పూర్తి కావడంతో ఇదే అదనుగా ప్రైవేట్‌ ఆపరేటర్లు టిక్కెట్‌ ధరలను రెండు, మూడు రెట్లు పెంచేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లేవారికి పండగ రోజుల్లో ఇళ్ల వద్ద అయ్యే వ్యయం కన్నా ప్రయాణానికే ఖర్చు అధికం కానుంది.

17 లేదా 18వ తేదీన తిరిగి వెళ్లే ఏర్పాట్లు

సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలలో ఉన్నవారు తమ సొంత ప్రాంతమైన గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున తరలి రావడం సర్వసాధారణం. కరోనా తరువాత చాలా మంది సొంత వాహనాలైన కార్లలో పండగ సమయంలో రావడం పెరిగింది. అయితే మధ్య తరగతి, పేద వర్గాలకు చెందినవారు రైలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి, ఉన్నత ఉద్యోగాల కోసం మహా నగరాలకు వలస వెళ్లినవారు అధికం. అందునా ఒకప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివాసముంటున్నవారు అధికం. వీరంతా పండగకు రావడం తప్పనిసరి.

వచ్చే ఏడాది జనవరి 14న తేదీ బుధవారం భోగి పండగ వచ్చింది. అయితే తొమ్మిదవ తేదీ రెండవ శనివారం కావడంతో చాలా మంది శుక్రవారం రాత్రి బయలుదేరనున్నారు. రెండవ శనివారం, తరువాత ఆదివారం సెలవు కావడంతో సోమ, మంగళవారాలు సెలవులు పెట్టుకుంటే తిరిగి 17వ తేదీ శనివారం, 18వ తేదీ ఆదివారం వెళ్లనున్నారు. 18వ తేదీ అమావాస్య కావడంతో చాలామంది 17వ తేదీన తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రైళ్లు.. బస్సులు ఫుల్‌

ఉమ్మడి జిల్లాకు వచ్చేవారు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ల నుంచి బయలుదేరి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు వస్తారు. ఆ రోజుల్లో రెగ్యులర్‌గా నడిచే రైళ్ల వెయిటింగ్‌ లిస్టు భారీగా ఉంది. గౌతమీ, గోదావరి, కోకనాడ, ఎల్‌టీటీ వంటి ప్రధాన సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల టిక్కెట్‌లు వెయిటింగ్‌ లిస్టు పరిమితి కూడా దాటిపోవడంతో రిగ్రెట్‌లో పెట్టారు. పండగ కోసం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక ఆర్టీసీ బస్సులలో కూడా టిక్కెట్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. హైదరాబాద్‌ నుంచి అమలాపురం బస్టాండ్‌కు రోజూ సుమారు పది రెగ్యులర్‌ బస్సులున్నాయి. వీటిలో తొమ్మిదవ తేదీ ఉదయం నడిచే బస్సులకు తప్ప మిగిలిన బస్సుల టిక్కెట్లు పూర్తయ్యియి. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం, రాత్రి సర్వీసుల బస్సులు టిక్కెట్లు కూడా అయిపోయాయి. జిల్లాలో అమలాపురంతో పాటు రాజోలు, రామచంద్రపురం డిపోల బస్సుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది.

అమాంతంగా పెరిగిన ధరలు

ఏపీఎస్‌ ఆర్టీసీ ఏసీ, నాన్‌ఏసీ బస్సులు అనే తేడా లేకుండా టిక్కెట్లు అయిపోవడంతో చాలామంది ప్రైవేట్‌ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ ఆపరేటర్లు బస్సు టిక్కెట్‌ ధరలు అమాంతంగా పెంచేశారు. హైదరాబాద్‌ నుంచి అమలాపురం 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్‌ ధరలు రెండు,మూడు రెట్లు పెరిగాయి. అన్‌ సీజన్‌లో నాన్‌ ఏసీ సిటింగ్‌ రూ.500కు కూడా వచ్చే టిక్కెట్‌ ధర ఇప్పుడు ఏకంగా రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉంది. నాన్‌ ఏసీ స్లీపర్‌ టిక్కెట్‌ ధర రూ.1,800 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సిటింగ్‌ ధర రూ.రెండు వేల నుంచి రూ.2,800 వరకు ఉంది. స్లీపర్‌ టిక్కెట్‌ ధర రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు పలుకుతోంది. తొమ్మిదవ తేదీన అయితే ఏకంగా రూ.2,600ల నుంచి రూ.నాలుగు వేల వరకు ఉండడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే జనవరి 18వ తేదీన నాన్‌ ఏసీ, ఏసీ సిటింగ్‌ ధర రూ.1,500 నుంచి రూ.2,500ల వరకు ఉండగా, స్లీపర్‌ ధరలు రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకు ఉండడం గమనార్హం. టిక్కెట్‌ రేట్లు చూసినవారికి కొత్త దుస్తులు, ఇతర ఖర్చుల కన్నా ప్రయాణ ఖర్చులే అధికంగా అవుతాయని పండగలకు సొంత గ్రామాలకు వచ్చేవారు వాపోతున్నారు.

నోరు మెదపని ప్రభుత్వం

ప్రైవేట్‌ ఆపరేటర్ల దోపిడీపై చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆపరేటర్లలో ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు, ప్రధాన నేతలు ఉండడంతో చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ బస్సు టిక్కెట్‌ల ధరలు రెండు, మూడు రెట్లు పెంచిన విషయం వివిధ యాప్‌లలో బహిరంగంగా కనిపిస్తున్నా ఆర్టీవో అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇక పండగ సమయంలో దొడ్డిదారిన బస్సులు నడిపేందుకు సైతం ప్రైవేట్‌ ఆపరేటర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిమాండ్‌ లేని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలుపుదల చేసి డిమాండ్‌ ఉన్న సర్వీసులో తిప్పనున్నారు. ఇటీవల పలు ప్రైవేట్‌ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. గత అక్టోబర్‌ 24వ తేదీన కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ బస్సు దగ్ధమైన తరువాత తనిఖీల పేరుతో వారం రోజుల పాటు హడావుడి చేసిన ఆర్టీవో అధికారులు తరువాత వాటి వంక చూడలేదు. ప్రయాణీకుల భద్రత విషయాన్ని గాలికి వదిలేశారు. ఇక పండగ సమయంలో చూసీచూడనట్టు వదిలేసే అవకాశముండడంతో ప్రైవేట్‌ ఆపరేటర్లు ఇష్టానుసారంగా బస్సులు తిప్పనున్నారు.

పండగ బాదుడు మొదలు1
1/2

పండగ బాదుడు మొదలు

పండగ బాదుడు మొదలు2
2/2

పండగ బాదుడు మొదలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement