అమలాపురం టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీ క్రీడా మైదానంలో సోమ, మంగళవారాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అమలాపురానికి చెందిన వెటరన్ క్రీడాకారిణి మెహబూబ్ షకీలా ప్రతిభ చాటింది. 35, 45 వయస్సు విభాగాల్లో ఈ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగాయి. హై జంప్లో మెహబూబ్ షకీలా బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. పట్టణానికి చెందిన బూరగాయల శివరామకృష్ణ కూడా డిస్కస్ త్రో క్రీడలో తలపడ్డారు. జిల్లాకు చెందిన దాట్ల ఎన్ఎస్ రామరాజు 800 మీటర్లు, 1500 మీటర్లు పరుగు పందెంలో వెండి పతకాలను, జావెలిన్ త్రోలో ఎం.సాయిబాబు కాంస్య పతకాన్ని, 100 మీటర్ల పరుగు పందెంలో ఐ.సురేష్కుమార్ కాంస్య పతాకాన్ని సాధించారు.
వైభవంగా పండిత సదస్యం
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు వైభవంగా పండిత సదస్యం నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులు మహదాశీర్వచనం చేశారు. ఉదయం స్వామివారి మేలుకొలుపు, తీర్థం బిందె తెచ్చుట, విశేషార్చన, నిత్య హోమాలు, బలి హరణం, ద్రవిడ వేద పారాయణ, సాగాయి. మధ్యాహ్నం విష్వక్సేన పూజ, అష్టదిక్పాలక ఆరాధన, సదస్యం నిర్వహించారు. రాత్రి ప్రధాన హోమాలు, బలి హరణము, నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు వేద పండితులను సత్కరించారు. ఆలయ అర్చక కమిటీ సభ్యుడు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యుడు శిష్టా సూర్య కుటుంబరావు, గ్రామ సర్పంచ్ పోచిరాజు బాబురావు, సూర్యకుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
20 నుంచి మురమళ్ల
వీరేశ్వరుని బ్రహ్మోత్సవాలు
ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆలయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు శైవాగమ పండితులు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో జరగనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 21న బ్రహ్మోత్సవ కల్యాణం జరుగుతుందని, పాల్గొనే భక్తులు కార్యాలయంలో గాని దేవదాయశాఖ వెబ్సైట్లో గాని నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రీ వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముంబయ్కి చెందిన ఎస్.వి.ఎస్.కె. కిషోర్ రూ.పది వేలు విరాళంగా అందించారు. ఆలయాన్ని రాతి కట్టడంతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
గవర్నర్ పర్యటనకు
పక్కా ఏర్పాట్లు చేయాలి ˘
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం జిల్లా కేంద్రమైన కాకినాడలో పర్యటించనున్నందున సంబంధిత ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ వస్తున్నారన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో హెలిపాడ్ను సిద్ధం చేసి, రూట్ బారికేడింగ్ చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కాన్వాయ్, రూట్ క్లియరెన్స్, గార్డ్ ఆఫ్ ఆనర్ వంటివి పోలీస్ శాఖ చేపట్టాలన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


