సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాణాలకు రక్షణ లేదని వైఎస్సార్ సీపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాస్ అబ్బీస్ జనవరి 28వ తేదీన రాజమహేంద్రవరం రవి హాస్పిటల్లో మత్తుమందు వికటించడం వల్ల చనిపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కలెక్టర్, ఎస్పీలకు గ్రీవెన్స్లో విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ కీర్తికి, రాజమహేంద్రవరం డీఎస్పీకి మంగళవారం మరోసారి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, 40 రోజులు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. మృతుడు జనసేన కార్యకర్త అయినా ఆ పార్టీ ఈ విషయంపై స్పందించకపోవడం విచారకరం అన్నారు. వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. కల్తీ పాల ఘటనలో చనిపోయిన వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప నిజాయితీగా విచారణ చేపట్టలేదన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామని, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి


