బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కొరత లేకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మంగళవారం నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం, సరఫరా నిలిచిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు షాపులు మూసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఆహారం కోసం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా – గోదావరి (కేజీ) బేసిన్ డి–6 బ్లాక్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు భారీగా వెలికితీసి, గుజరాత్, మహారాష్ట్రలకు తరలిస్తున్నారని చెప్పారు. ఇందులో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగుబాటు వైఖరి ప్రదర్శించడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీస్తుందని అన్నారు. ఇరాన్తో పాటు సరిహద్దు దేశాలతో కూడా కేంద్రం సత్సంబంధాలు కొనసాగిస్తే మన దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు.
ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాకు లొంగిపోవడమే కాకుండా ఇజ్రాయిల్ వంటి దురాక్రమణ దేశానికి మద్దతు ప్రకటించడం దేశ ప్రతిష్టను దిగజారుస్తోందని అన్నారు. అమెరికా షరతులను వ్యతిరేకించి దేశ ప్రయోజనాల కోసం కేంద్రం నిలబడాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డీఆర్ఓ తిప్పేనాయక్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు కేఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కేజీ బేసిన్లో సగం గ్యాస్
మన రాష్ట్రానికే కేటాయించాలి
ఫ సీపీఎం డిమాండ్


