మంచు తెరలు తొలగక ముందే.. మట్టుబెట్టారు! | YSRCP Vice MPP of Gara mandal Brutally Murdered In Srikakulam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత బరాటం రామశేషు దారుణ హత్య

Dec 7 2022 1:17 PM | Updated on Dec 7 2022 1:17 PM

YSRCP Vice MPP of Gara mandal Brutally Murdered In Srikakulam - Sakshi

వారం రోజులు రెక్కీ చేశారు. చీకట్లు తొలగక ముందే మాటు వేశారు. మంచు తెరలు తొలగక ముందే.. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దాడి చేసి, మట్టుబెట్టి మాయమయ్యారు. గార మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు బరాటం రామశేషు దారుణ హత్యకు గురైన తీరిది. ముగ్గురు అగంతకులు కత్తి వేట్లకు తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం కూడా రామశేషుపై ఇలాగే.. ఇదే ప్రాంతంలోనే హత్యాయత్నం జరిగింది. అప్పుడూ ఇప్పుడూ కూడా దాడికి పాల్పడిన వారు ముగ్గురే కావడం పలు అనుమానాలకు తావిస్తోంది

శ్రీకాకుళం రూరల్‌/గార: గార వైస్‌ ఎంపీపీ, శ్రీకూర్మం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత బరాటం రామశేషు(45) మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఉదయం తన గ్యాస్‌ గోడౌన్‌ వద్దకు గ్యాస్‌ బండలు లోడ్‌ చేయడానికి వెళ్లగా.. అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు సమయం చూసి పదునైన కత్తితో ఆయనపై దాడికి తెగబడ్డారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మాటు వేసి..  
రామశేషు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో శ్రీకూర్మంలోని తన ఇంటి నుంచి తన భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్దకు వెళ్లారు. రెండు వాహనాలకు బండలు లోడ్‌ చేయించి పంపించారు. మరో వాహనం కోసం ఎదురు చూస్తూ.. గోడౌన్‌ ముందు దువ్వుపేటకు వెళ్లే రోడ్డుపైకి వచ్చి నిలుచున్నారు. అదే సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న దుండగులు పదునైన కత్తితో ఆయనపై దాడి చేశారు. ముఖం, మెడపై బలంగా దాడి చేయడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడు గులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు గ్రామంలోని వారికి విషయం చెప్పారు. రామశేషుకు భార్య జయలక్ష్మి (శ్రీకూర్మం పంచాయతీ ఉప సర్పంచ్‌), కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి బరాటం నాగేశ్వరరావు సీనియర్‌ వైఎస్సార్‌ సీపీ నాయకుడు కాగా శ్రీకాకుళం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నాలుగు బృందాలతో దర్యాప్తు.. 
హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీ మహేంద్ర, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ సన్యాసినాయుడు, క్లూస్, డాగ్‌స్క్వాడ్‌ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయి పలు కోణా ల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకూర్మంతో పాటు చింతువలస, శ్రీకూ ర్మం జంక్షన్, అంపోలు జంక్షన్, జైలు రోడ్డులోని సీసీ ఫుటేజీలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అదేవిధంగా గ్యాస్‌ గోడౌన్‌లో పనిచేస్తున్న వ్యక్తులను విచారించి పలు విషయాలు రాబట్టారు. మృతదేహాన్ని పరిశీలించిన డాగ్‌ బృందం సమీప సునామీ కాలనీ అరటి తోటల వద్దకు వెళ్లి ఆగింది. 

గతంలోనూ.. 
టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకూర్మం సర్పంచ్‌గా ఉన్న బరాటం రామశేషు చింతువలస సమీపంలో డిసెంబర్‌ 21వ తేదీన 2017 వేకువన నాలుగున్నర గంటల ప్రాంతంలో దాడికి గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు వెనక నుంచి వచ్చి మెడపై పదునైన కత్తితో దాడిచేయగా మెడ వద్ద బలమైన గాయమైంది. వాకింగ్‌ సమయంలో పెద్దగా అరుపులు వేయడం, చంపేశాం అన్న నిర్ధారణలో ఆగంతకులు పారిపోవడం, వాకింగ్‌ చేస్తున్న వ్యక్తులు వెనువెంటనే ఆస్ప త్రిలో చేర్చడంతో మృత్యువు నుంచి బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనను ఏకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. రామశేషు మృతిపై సమాచారం అందిన వెంటనే వైఎస్సార్‌ సీపీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు, ఎంపీపీ గొండు రఘురామ్, పార్టీ కనీ్వనర్‌ పీస శ్రీహరిరావు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్‌ ముంజేటి కృష్ణమూర్తి, మార్పు పృధ్వీరాజ్‌ తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు పోలీసులతో హత్యపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామశేషు తండ్రి నాగేశ్వరరావుతో మాట్లాడారు.   

రామశేషు అంత్యక్రియలు నేడు 
గార: వైస్‌ ఎంపీపీ బరాటం రామశేషు అంత్యక్రియలు బుధవారం ఉదయం 7.30 గంటలకు శ్రీకూర్మంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యు లు తెలిపారు. మృతదేహానికి మంగళవారం రిమ్స్‌లో పోస్టు మార్టం నిర్వహించి, సాయంత్రం స్వగృహానికి తీసుకువచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement