మత్తులో 2 హత్యలు.. | Two Murders In Sanjeevaiahnagar Basti And Banjara Hills Fue To Alcohol Intoxication | Sakshi
Sakshi News home page

మత్తులో 2 హత్యలు..

Jun 2 2026 8:12 AM | Updated on Jun 2 2026 8:12 AM

Two Murders In Sanjeevaiahnagar Basti And Banjara Hills Fue To Alcohol Intoxication

సంజీవయ్యనగర్‌ బస్తీ, బంజారాహిల్స్‌లో ఘటనలు

కంటోన్మెంట్, బంజారాహిల్స్‌: గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో పొడిచి మరో యువకుడిని, మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశారు. మారేడ్‌పల్లి సంజీవయ్యనగర్‌ బస్తీ వాసి, ఫ్లవర్‌ డెకరేటర్‌ శ్రావణ్‌ (22)ను అదే ప్రాంతానికి చెందిన నిఖిల్‌ (23) అంతమొందించాడు.

బీటెక్‌ ఆపేసి గంజాయికి బానిసైన నిఖిల్‌... శ్రావణ్‌ బంధువుల యువతిని అసభ్య సైగలతో వేధిస్తున్నాడు. శ్రావణ్, నిఖిల్‌ మధ్య 2 నెలల క్రితం గొడవ జరిగింది. ఆదివారం రాత్రి యువతిని నిఖిల్‌ మళ్లీ వేధించాడు. ఆమె తండ్రి మందలించగా గొడవ మొదలైంది. అప్పుడే ఇంటికి వస్తున్న శ్రావణ్‌ నిలదీయగా... కోపోద్రిక్తుడైన నిఖిల్‌ కత్తితో 8 సార్లు పొడిచాడు.  గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రావణ్‌ చనిపోయాడు. నిఖిల్‌ గంజాయి తాగడంతో పాటు అమ్ముతుంటాడని, ఆ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బేంగపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నం11 లోని బోళానగర్‌ బస్తీకి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ (32), రౌడీషీటర్‌ అహ్మద్‌ హుస్సేన్‌ స్నేహితులు. ఆటో నడుపుతుంటారు. ఖాలిద్‌ సయీద్‌ జావీద్, హైదర్‌ షరీఫ్, అన్వర్, మతీన్‌తో కలిసి హయత్‌ ప్లేస్‌ హోటల్‌ గల్లీలో ఆటోలోనే ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు. ఖాళీ బీరు సీసాలను హుస్సేన్‌ రోడ్డు పక్కన పడేశాడు. అలా నిర్లక్ష్యంగా పడేస్తే ఎవరికైనా గుచ్చుకుంటాయని ఇమ్రాన్‌ మందలించాడు. హుస్సేన్‌ కోపంతో నాకే నీతులు చెబుతావా? అంటూ దాడికి దిగాడు. అరగంట పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుప్పకూలిన ఇమ్రాన్‌ మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement