విహారయాత్రలో విషాదం: రిజర్వాయర్‌లోకి దిగి.. నీట మునిగి  | Three Students Died After Drowning In Reservoir In Nalgonda District | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో విషాదం: రిజర్వాయర్‌లోకి దిగి.. నీట మునిగి 

Aug 14 2022 3:24 AM | Updated on Aug 14 2022 7:32 AM

Three Students Died After Drowning In Reservoir In Nalgonda District - Sakshi

దిండె ఆకాశ్‌, బంటు గణేశ్‌, పండిట్‌ కృష్ణ 

పెద్దఅడిశర్లపల్లి: విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఏకేబీఆర్‌)లో శనివారం ఈతకు దిగి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. గుడిపల్లి పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామా బాద్‌ జిల్లాకు చెందిన దిండె ఆకాశ్‌ (20), సిరిసిల్ల జిల్లా వే ములవాడకు చెందిన బంటు గణేశ్‌ (20), వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన కల్లపు లోహిత్, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన చందూ, ఖమ్మం జిల్లాకు చెందిన అవినాష్, నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి గ్రామానికి చెందిన ప్రియాంక.. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నారు. ప్రియాంక సోదరుడు పండిట్‌ కృష్ణ (18) తన సోదరి స్నేహితులతో కలిసి ఇక్కడే కాళీమందిర్‌ వద్ద గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. 

అందరికీ రాఖీలు కట్టి.. 
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రియాంక శుక్రవారం సోదరుడు కృష్ణ వద్దకు వచ్చింది. అతడితోపాటు తన స్నేహితులకు రాఖీలు కట్టింది. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో అందరూ కలిసి నాగార్జునసాగర్‌ విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నారు. సాయంత్రం అందరూ కలిసి ప్రియాంక సొంతూరు పుట్టంగండికి చేరుకున్నారు. స్నేహితులందరితోపాటు ప్రియాంక తండ్రి పండిట్‌ జయానంద్‌ శనివారం ఉదయమే నాగార్జునసాగర్‌కు బయలుదేరా రు.

అక్కడ గేట్ల ద్వారా కిందకు దూ కుతున్న కృష్ణమ్మ పరవళ్లను తిలకించి ఆనందంగా గడిపారు. సాయంత్రం పుట్టంగండికి బయలుదేరారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వా యర్‌ కట్టపై వెళ్తుండగా మెట్లు కనిపించడంతో అక్కడ స్నానాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రియాంక, ఆమె తండ్రి కట్టపై నిల్చోగా ఆకాశ్, గణేశ్, లోహిత్, చందూ, అవినాష్, పండిట్‌ కృష్ణ నీటిలోకి దిగి మెట్లపై కూర్చొని స్నా నాలు చేస్తున్నారు.

ఆకాశ్, గణేశ్, పండిట్‌ కృష్ణ మెట్లు దిగి ఇంకా కిందికి వెళ్లి నీటమునిగి గల్లంతవగా.. మిగతా వారు కేకలు వేస్తూ బయటికొచ్చారు. దీంతో అటువైపు గా వెళ్తున్న స్థానికులు నీటిలోకి దూకి గణేశ్, పండిట్‌ కృష్ణను బయటకి తీయగా అప్పటికే మృతిచెందారు. ఆకాశ్‌ ఆచూకీ తెలియలేదు. గుడిపల్లి ఎస్‌ఐ వీరబాబు జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆకాశ్‌ మృతదేహం లభ్యమైంది. విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement