‘ఇస్లామిక్‌ స్టేట్‌’ ప్రేరణతో ఉగ్ర ఉచ్చులోకి..

Islamic State trying to spread network in India, 168 arrests - Sakshi

37 కేసుల్లో 168 మంది అరెస్టు: ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ/చెన్నై:  కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ప్రేరణతో భారత్‌లోనూ ముష్కరులు పెచ్చరిలి్లపోతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వెల్లడించింది. ఉగ్రవాద దాడులు, కుట్ర, నిధుల అందజేతకు సంబంధించిన 37 కేసుల్లో ఇప్పటిదాకా 168 మందిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. 31 కేసుల్లో చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేశామని తెలిపింది.

నిందితుల్లో ఇప్పటిదాకా 27 మందిని న్యాయస్థానాలు దోషులుగా తేల్చాయని పేర్కొంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఆమాయక యువతపై వల విసురుతోందని, భారత్‌లో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం పట్ల ఆకర్షితులైన వారిని విదేశాల నుంచే సోషల్‌ మీడియా వేదికల ద్వారా సంప్రదించి ఉచ్చులోకి లాగుతున్నారని తెలిపారు.  

తమిళనాడులో ఒకరి అరెస్టు
ఇస్లామిక్‌ స్టేట్, హిజ్‌్బ–ఉత్‌–తహ్రీర్‌ ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలు, భావజాలాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా వ్యాప్తి చేస్తున్నారన్న సమాచారంతో తమిళనాడులో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం రాష్ట్రంలో రెండు చోట్ల సోదాలు నిర్వహించి ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. తిరువారూర్‌ జిల్లాలో బవా బహ్రుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top