సాక్షి,హైదరాబాద్: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్-16 ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మృతులు సిరిసిల్ల పట్టణానికి చెందినవారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఒకే కుటుంబసభ్యులు యాదగిరి గుట్ట నుంచి వస్తుండగా శంషాబాద్ వైపు వెళ్తున్న కారు (నంబర్ TS 23 F 2298) అతివేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది.
కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులున్నారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రయాణికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.


