బాలిక హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Execution of accused in girl murder case - Sakshi

లైంగికదాడి నేరం కింద బతికి ఉన్నంతవరకు జీవితఖైదు 

పోక్సోచట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం తీర్పు 

తన భర్తకు ఉరిశిక్ష వేయాలని కోరిన భార్య

విజయవాడ లీగల్‌: విజయవాడ శివారులో బాలికపై లైంగికదాడి చేయడంతోపాటు హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్షతోపాటు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. సెక్షన్‌ 376 కింద బతికి ఉన్నంతవరకు జీవిత ఖైదు, పోక్సో చట్టం సెక్షన్‌ 201 కింద ఏడేళ్లు, సెక్షన్‌ 6 కింద 20 ఏళ్లు, సెక్షన్‌ 302 కింద ఉరిశిక్ష విధించారు. ఈ కేసు వివరాలిలా.. 

► విజయవాడలోని గొల్లపూడి శివారు నల్లకుంటలో మొవ్వ ఏసుపాదం, రమణ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ద్వారక (7) అనే కుమార్తె ఉంది.  ఇదే ప్రాంతంలో నిందితుడు బార్లపూడి పెంటయ్య అలియాస్‌ ప్రకాశ్‌ (37) తన భార్యతో కలసి ఉంటున్నాడు.  
► గతేడాది నవంబర్‌ 10న నిందితుడి భార్య నూజివీడులో చదువుతున్న తన పిల్లలను చూసేందుకు వెళ్లింది.  బాలిక తల్లి పనికి వెళ్లగా తండ్రి అనిల్‌ ఇంటిలోనే ఉన్నాడు. బాలిక టీవీ చూసేందుకు తమ ఇంటి పక్కనే ఉన్న పెంటయ్య ఇంటికి వెళ్లింది.  
► మద్యం మత్తులో ఉన్న పెంటయ్య బాలికపై లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసి గోనె సంచిలో పెట్టి ఇంట్లోనే దాచాడు. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు అన్ని చోట్లా వాకబు చేశారు. వారితోపాటు పెంటయ్య కూడా వెతికాడు.  
► ఇంటికి తిరిగొచ్చిన నిందితుడి భార్య గోనె సంచిని చూసి అనుమానం వ్యక్తం చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.  
► దీంతో ద్వారక తండ్రి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.  
► నిందితుడి భార్య కోర్టులో సాక్ష్యం చెప్తూ తన భర్తకు ఉరిశిక్ష వేయాలని కోరడం విశేషం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top