చిత్తూరు కలెక్టరేట్ : చదువుకు పేదరికం అడ్డుకాకుడదు. ఆర్థిక ఇబ్బందులు ఆశయాలను తుంచేయకూడదు. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడి బిడ్డ సైతం నేడు ప్రపంచ స్థాయి విద్యను అందుకునేలా కేంద్రం ప్రభుత్వం చేయూత ఇస్తోంది. ఇంటర్ తర్వాత బంగారు భవిష్యత్కు బాటలు వేసే కోర్సుల్లో చేరేందుకు ఆర్థిక భరోసా ఇస్తూ పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అమలుచేస్తోంది. ఎలాంటి పూచీకత్తు, హామీదారులు లేకుండా ఈ పథకం కింద బ్యాంకుల్లో రుణ సహాయం ఇప్పిస్తోంది. విదేశాల్లో ఉన్నత చదువులకూ దీన్ని వర్తింపజేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూ పొందించింది. రుణ మొత్తంలో ట్యూషన్ ఫీజు మాత్ర మే కాకుండా విద్యార్థికి అవసరమైన వసతి, రవాణా తదితర విద్యా సంబంధిత ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపే రుణం మంజూరుపై బ్యాంకర్లు స్పష్టత ఇస్తారు.
రుణం వివరాలు ఇలా..
రూ.4 లక్షలలోపు, రూ.4 లక్షల నుంచి రూ.7.50 లక్షలు, రూ.7.50 లక్షలు కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన రుణాలు మూడు విభాగాల్లో మంజూరవుతాయి. కోర్సుల ఫీజుకు అనుగుణంగా రుణాలను ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు కు గడువు తేదీ లేదు. ఒక విద్యార్థి ఒక్కసారే దర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
నమోదు ఇలా..
పీఎం విద్యాలక్ష్మి వెబ్సైట్లోకి వెళ్లి పేరు, సెల్ నంబ రు, ఈమెయిల్ ఐడీ, చిరునామా తదితర వివరా లు నమోదు చేయాలి. మార్కుల జాబితా, చదివిన కోర్సుకు సంబంధించిన పత్రాలు, చదవాలనుకుంటున్న కోర్సులకు చెందిన ప్రవేశ పత్రం జత చేయాలి.
అర్హులు వీరే..
ఇంజినీరింగ్, వైద్య విద్య,, వృత్తి విద్యా కోర్సులు, ఆర్కిటెక్చర్, చార్టర్డ్ అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఎంఎస్, ఐఐటీ, విమానయాన వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు డిగ్రీ చదివే విద్యార్థులు రుణం పొందేందుకు అర్హులు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


