విజ్ఞాన దీపం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన దీపం

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

● నాటి జగనన్న ఆలోచనల ఫలితం ● ఉద్యోగార్థులు కాదు ● విద్యార్థులే ఉద్యోగాల సృష్టికర్తలు ● విద్యా శాఖలో ఈఎండీపీ సరికొత్త ఒరవడి

బ్రష్‌ విత్‌ పేస్ట్‌ ప్రాజెక్టుతో తిరుపతి విద్యార్థులు

రోసీ అరోమా ప్రాజెక్టుతో పుత్తూరు విద్యార్థులు

కార్పొరేట్‌ సంస్థల సహకారం

రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యే ఉత్తమ ప్రాజెక్టుల విద్యార్థులకు ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థలు నగదు చెల్లించి లైసెన్స్‌ తీసుకొనే అవకాశం ఉంది. తద్వారా సదరు కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌ చేసుకొంటుంది. ఈక్రమంలో కంపెనీ విద్యార్థులు కలసి ప్రాజెక్టును మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి పేటెంట్‌ హక్కులను దక్కించుకొని వ్యాపారవృద్ధికి దోహదపడుతాయి. ఒక్కోసారి విద్యార్థికి పెద్ద మొత్తంలో నగదు చెల్లించి పేటెంట్‌ హక్కును కంపెనీ పొందే అవకాశం సైతం ఉంటుంది. తద్వారా విద్యార్థికి గుర్తింపు, కెరీర్‌ అవకాశాలు మెరుగవుతాయి.

పుత్తూరు: విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, ఉద్యోగాలను సృష్టించే నాయకులుగా ఎదగాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిందే వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం. విద్యార్థి దశ నుంచే వ్యాపార ఆలోచనలను పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలతో పదిమందికి మార్గదర్శకంగా నిలపాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఈఎండీపీ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఓ వేదికగా తీర్చిదిద్దారు. విద్యార్థులను పరీక్షలకే పరిమితం కాకుండా నైపుణ్యంతో కూడిన తొలి అడుగుగా ఈఎండీపీ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఈఎండీపీ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ కొత్త ఆవిష్కరణలను సమాజం ముందుంచుతున్నారు.

రాష్ట్ర స్థాయి ఎక్స్‌పో

ఈ నెల 9వ తేదీన జరిగిన జిల్లా స్థాయి వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (ఈఎండీపీ)లో మొత్తం 10 పాఠశాలల విద్యార్థులు తమ సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇందులో తిరుపతి ఎస్‌పీజేఎన్‌ఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జె.నవదీపిక, ఎ.తేజశ్రీ, కె.హేమశ్రీ ప్రదర్శించిన టూత్‌ ట్విన్‌ డ్యూ ప్రాజెక్టు ప్రథమ స్థానం కై వసం చేసుకొంది. పుత్తూరు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు పి.ధిల్లీరాణి, బి.శ్రీలక్ష్మీల రోసీ అరోమా ప్రాజెక్టు ద్వితీయ స్థానం కై వసం చేసుకొంది. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఈఎండీపీ ఎక్స్‌పోలో పాల్గొంటారు.

విద్యార్థులు విజ్ఞాన దీపాలుగా వెలుగొందాలన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన నుంచి ఆవిష్కరించబడిన వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం(ఈఎండీపీ) నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తొలిసారిగా 2021 జూలై 20న 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టి, సమర్థవంతంగా అమలైంది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త ఆలోచనా విధానం.. అందుకు తగ్గ మార్గదర్శకత్వం వెరసి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వ్యాపార దృక్పథం ఈ మూడింటి మేళవింపుతో రూపొందించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను

ఇస్తోంది.

నా ఆలోచనలకు ఆచరణ రూపం

కృత్రిమ పరిమళ ద్రవ్యాల స్థానంలో సహజ పదార్థాలతో మంచి పరిమళాన్ని తయారు చేయాలన్న నా ఆలోచనకు ఈఎండీపీ వేదికై ంది. మేం తయారు చేసిన రోస్‌ సెన్ట్‌ అనే ప్రకృతి పరిమళం ద్వారా కృత్రిమ పరిమళాలతో చర్మానికి కలిగే హానిని తప్పించవచ్చు. మా ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. – పి.డిల్లీరాణి, 9వ తరగతి విద్యార్థి, పుత్తూరు

కొత్త విషయాలపై ఆసక్తి పెరిగింది

ఈఎండీపీ కార్యక్రమం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరిగింది. ప్రకృతి పరిమళాన్ని తయారు చేయడం ద్వారా ప్రకృతి పదార్థాల ప్రాముఖ్యతను తెలుసుకొన్నాను. మా ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

– బి.శ్రీలక్ష్మీ, 9వ తరగతి విద్యార్థి, పుత్తూరు

Advertisement
 
Advertisement
Advertisement