– రెండు నాటు తుపాకీలు లభ్యం
గుడిపాల: కోడి తెచ్చిన తంట.. ఓ నాటు తుపాకీ లభ్యమయ్యేట్టు చేసింది. వివరాలు.. మండలంలోని చింతగుంటూరు గ్రామంలో రాజేంద్రన్, రమేష్ కుటుంబాలకు చెందిన ఒక నాటుకోడి కనిపించకుండా పోయింది. దీంతో వారు చుట్టుపక్కల వెదికారు. తీరా ఆదే గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే అతను నాటుకోడిని దొంగలించి తినేశాడని తెలుసుకున్నారు. దీంతో చిట్టిబాబును వారు నిలదీశారు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన రాజేంద్రన్, రమేష్ కత్తి తీసుకొని వీధిలోకి వచ్చారు. చిట్టిబాబు తన ఇంట్లో ఉన్న నాటు తుపాకీని బయటికి తెచ్చి వారికి చూపించడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై గుడిపాల పోలీసులకు రమేష్, రాజేంద్రన్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ గ్రామంలో చిట్టిబాబును విచారించగా మరో నాటు తుపాకీ కూడా లభ్యమైంది. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
మాజీ సైనికుల
సంక్షేమానికి ప్రాధాన్యం
చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సంక్షేమానికి ప్రా ధాన్యతనిస్తున్నట్లు కమాండర్ నిఖిల్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు తెలిపారు. శుక్రవారం జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన మాజీ నావికాదళ సైనికులు, కుటుంబ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మాజీ సైనికుల పెన్షన్ సాంకేతిక సమస్యలను పరిష్కరించారన్నారు. మాజీ సైనికుల సంక్షేమం పట్ల నావికాదళం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య, సభ్యులు రాజన్, రఘుపతి, వెంకట్ పాల్గొన్నారు.


