చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని 14 ఏళ్లు దాటిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని డీఎం అండ్ హెచ్వో శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్యకార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి నెలా 1వ తేదీన హెచ్ఎంఐఎస్, సీఎస్ఎస్ఎం తదితర రిపోర్టులను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సీఎస్ఎస్ఎంలో ఈసీ డేటాను సోమవారం నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ప్రజల సానుకూల అభిప్రాయం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్) 80 శాతం కంటే తక్కువ ఉండకూడదని, ప్రతి ఇండికేటర్కు సంబంధించిన రికార్డులు నిర్వహిస్తూ 100 శాతం డేటా అప్లోడ్ చేయాలని సూచించారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం నాటికి పూర్తి చేయాలని, సోమవారం రోజున ఆశా వర్కర్లు ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకువచ్చి టీకాలు వేయించేలా చూడాలన్నా రు. యువిన్ పోర్టల్లో గర్భిణులు, శిశువుల నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయా లని పేర్కొన్నారు. అలాగే ఐఈసీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అభా ఐడీ లేకుండా గర్భిణుల వివరాలను నమోదు చేయరాదని హెచ్చరించారు. ఎన్సీడీ కార్యక్రమాల్లో అనుమానిత కేసులను గుర్తించి, వైద్యాధికారులు నిర్ధారించి పాలో అప్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ, అనిల్ కుమా ర్, జార్జ్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.


