– వేలం పాటలో రూ.25 లక్షలు ఆదాయం
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు పంచా యతీకి కాసుల పంట పండింది. వారపు సంత, వాణిజ్య సముదాయాలకు వేలం పాటల ద్వారా రూ.25,03,700ల ఆదాయం లభించింది. పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి మాట్లా డుతూ సర్పంచ్ మాసిలామణి ఆధ్వర్యంలో శనివారం వేలం పాటలు నిర్వహించినట్టు తెలిపారు. పంచాయతీకి భారీ ఆదాయం రావడం శుభపరిణామమన్నారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర సౌకర్యాల కోసం ఖర్చు చేస్తామని వివరించారు.
ప్రశాంతంగా బయాలజీ పరీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా శనివారం బయాలజీ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 129 పరీక్ష కేంద్రాల్లో 22,128 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 21,853 మంది హాజరయ్యారని, 275 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. 52 పరీక్ష కేంద్రాలను డీఈవో 4, అసిస్టెంట్ కమిషనర్ 6, ఫ్లయింగ్ స్క్వాడ్ 11 మంది పరిశీలించినట్టు పేర్కొన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ 96 కేంద్రాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా బయాలజీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈవో వెల్లడించారు.
సెలవుపై వెళ్లిన చిత్తూరు డీఎస్పీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ శనివారం నుంచి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో రెండు నెలలు విధులకు సెలవు పెట్టారు. డీటీసీ లేదా పలమనేరు డీఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు నగరి డీఎస్పీ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న డీఎస్పీల బదిలీల్లో చిత్తూరు జిల్లాకు నూతన డీఎస్పీలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అప్పటికప్పుడే
ఎల్ఆర్ఎస్ అనుమతులు
చిత్తూరు అర్బన్: అన్ని పత్రాలు ఉంటే ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) అనుమతులను అప్పటికప్పుడే ఇస్తామని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఆయన శనివారం చిత్తూరు ఏసీపీ నాగేంద్రతో కలిసి చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి పత్రాలు మంజూరు చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న యజమానులు సరైన పత్రాలను సకాలంలో కార్పొరేషన్ అధికారులకు అందజేయాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా చేస్తున్నామని, దీని వల్ల స్థలాల యజమానులకు మేలు చేకూరుతుందన్నారు. లైసెన్సుడు ఇంజినీర్లు సైతం దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి ఫైళ్లు త్వరగా పరిష్కారమవడానికి సహకరించాలని సూచించారు.


