నేడు పాఠశాలలకు సెలవు
చిత్తూరు కలెక్టరేట్ : శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజులో ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
విస్తృత తనిఖీలు
చిత్తూరు రూరల్(కాణిపాకం): తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు నగరంలోని మురకంబట్టు ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. తాలూకా ఎస్ఐ అశోక్కుమార్ తన బృందంతో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా రౌడీ షీటర్లను గుర్తించే పనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను నిలిపి ప్రశ్నిస్తున్నారు. వాహనాల్లో అక్రమంగా నగదు, మద్యం లేదా ఇతర వస్తువులు తరలిస్తున్నారో లేదో పరిశీలిస్తున్నారు.
సరిహద్దు ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో చట్టాలను కాపాడడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.9 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ అధికారులు పకడ్బందీగా లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరి గిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,90,12,047 ఆదాయం వచ్చింది. ఇందులో బంగారం 87 గ్రాములు, వెండి 1.100 కిలోలుగా లెక్కగట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.18,926, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.1,79,966 వచ్చింది. యూఎస్ఏవి 1,607 డాలర్లు, మలేషియావి 6 రింగిట్స్, కెనడా 250 డాలర్లు, యూరో 30 యూరో, ఇంగ్లండ్ 20 పౌండ్స్, ఆస్ట్రేలియావి 115 డాలర్స్, సింగపూర్ 22 డాలర్లు, యూఏఈ 30 దిర్హామ్స్ రియాల్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
చిత్తూరు కార్పొరేషన్ పై ఏసీబీ ఆరా
చిత్తూరు అర్బన్: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులు ఇస్తే గానీ పనులు చేయడం లేదనే ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ )అధికారులు ఆరా తీస్తున్నారు. నగరంలోని ఓ భవనానికి యజమాని పేరు మార్చండికి కార్పొరేషన్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గతంలో లంచం అడగడం తెలిసిందే. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులు కార్పొరేషన్ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. సదరు ఇన్స్పెక్టర్ గురించి వివరించారు. త్వరలోనే కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి దీనిపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.


