ఉత్తుత్తి ఆర్భాటమే!
కుప్పం : కుప్పంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని.. వందల కోట్లు కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు మంజూరు చేస్తున్నారని గొప్పలు చెబుతూ...అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే కుప్పం పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులే.
పట్టణంలో అర్ధంతరంగా ఆగిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికార పార్టీ నేతలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎంఆర్రెడ్డి సర్కిల్ నుంచి కుప్పం రైల్వే గేటు వరకు రెండవ రోడ్డు రీచ్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరయ్యాయని హంగామా చేశారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం నిర్ణయించలేదు, రోడ్డు విస్తరణ మార్కింగ్ చేయకుండానే ఆర్భాటం చేశారు. తీరా రోడ్డు విస్తరణకు ఆర్అండ్బీ ప్రభుత్వ కార్యాలయం అడ్డంగా ఉందని, హఠాత్తుగా కార్యాలయం పూర్తి కానీ సొంత భవనంలోకి మార్చేశారు. రైల్వే గేటు సమీపంలోని ఆర్ అండ్బీ కార్యాలయం ప్రహరీ వద్ద పూజలు చేపట్టి జేసీబీతో గోడను కూల్చి వేశారు. అంతే ఇప్పటి వరుకు రోడ్డు విస్తరణ పనులు ఊసే లేకుండా పోయాయి.
ప్రారంభానికి నోచుకోలే..
రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉందని ఆర్అండ్బీ కార్యాలయాన్ని కృష్ణగిరి సర్కిల్లో నిర్మిస్తున్న సొంత భవనంలోకి మార్చేశారు. కానీ నెలలు గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు మాత్రం ఫ్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న భవనంలో నూతనంగా కుప్పం ఉద్యానశాఖ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు విస్తరణపై అధికారులు, నాయకులు చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉంది.
అభివృద్ధి పనులు అంతంతే..
అధికార పార్టీ నేతలది కుప్పం అభివృద్ధిపై ఉత్తుత్తిఽ ఆర్భాటాలు తప్ప ఒరిగింది ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. కోట్లతో కుప్పం అభివృద్ధి అంటే కేవలం దస్త్రం మీదే కనిపిస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ సైతం అభివృద్ధికి ఆమడ దూరంగా నిలుస్తోంది.


