హైజాక్ ముఠా హల్చల్
టీడీపీ యువనేత ఆధ్వర్యంలో
● భారీ దారి దోపిడీకి స్కెచ్ సిద్ధం చేసిన
పచ్చనేతలు
● ఎర్ర చందనం, గుట్కా, డ్రగ్స్ అక్రమ
రవాణే ఈ గ్యాంగ్ టార్గెట్
సాక్షి టాస్క్ఫోర్స్: ఓ టీడీపీ యువనేత గుట్కా పేరుతో మస్కా కొట్టాలని చూశాడు. దారి దోపిడీకి సిద్ధపడ్డారు. ఎర్రచందనం, గుట్కా, డ్రగ్స్ సరఫరాపై స్కెచ్ వేశాడు. భారీగా దండుకోవాలని దారి దోపిడీ బ్యాచ్ను సిద్ధం చేశాడు. ఈ స్కెచ్ బెడిసికొట్టింది. సొంత పార్టీ నేతను హైజాక్ చేయడంతో దారి దోపిడీ ముసుగు తొలగింది. తొలగిన ముసుగును కప్పిపుచ్చేందుకు పార్టీ పెద్దలంతా అండగా నిలిచారు.
విషయానికి వస్తే..
కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఓ వాహనంలో భారీగా గుట్కా చిత్తూరు మీదుగా వస్తోందని సోమవారం రాత్రి టీడీపీ ముఠాకు సమాచారం అందింది. గ్యాంగ్ లీడర్(టీడీపీ యువనేత) ప్లాన్ ప్రకారం ఇన్నోవా కారులో ముగ్గురు, ఇద్దరు ద్విచక్రవాహనంలో హైజాక్ దిగారు. తాగిన మైకంలో ముఠా గుట్కా తరలిస్తున్న వాహనాన్ని వదిలేశారు. అదే సమయంలో గుడిపాల మండలంలోని వెప్పాలమానుచేను గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు బెంగళూరుకు వెళ్లి వస్తుండగా వెంటబడ్డారు. ఈ నాయకుడు వస్తున్న కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉండడంతో.. ఇదే గుట్కా తరలిస్తున్న వాహనమని గుడిపాల వరకు వెంబడించారు. చీలాపల్లి సీఎంసీ వద్ద టీడీపీ నాయకుడి కారుకు పచ్చబ్యాచ్ అడ్డుపడింది. ఉలిక్కిపడిన ఆ టీడీపీ నేత కారును మళ్లించి వేగం పెంచారు. మళ్లీ ఈ పచ్చ బ్యాచ్ కల్వర్టు వద్ద అడ్డగించే ప్రయత్నం చేసింది. ఆ నాయకుడు అక్కడి నుంచి తప్పించుకుని ఇంకాస్త వేగం పెంచారు. ఇంతలో కారులో ఉన్న ఓ మహిళ మండలంలోని ఓ టీడీపీ కీలక నేతకు ఫోన్ చేసి.. తమను ఎవరో వెంబడిస్తున్నారని సమాచారం అందించారు. ఆ నాయకుడి సూచనల మేరకు గుడిపాల మండలంలోని హోటల్ వద్ద కారు ఆగింది. ఇంతలో స్థానికులు కూడా అక్కడికి రావడంతో ఆ పచ్చ బ్యాచ్కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘గుట్కా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది.. మేము చిత్తూరోళ్లం. లోకల్’’ అంటూ పచ్చబ్యాచ్ వారిని బెదరించే ప్రయత్నం చేసింది. ఆ టీడీపీ నేత ‘‘మేము కూడా పక్కా లోకల్.. మాది గుడిపాల’’ అంటూ ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువత నాయకుడు (గ్యాంగ్ లీడర్) అక్కడికి వచ్చి కారును ఆపాడు. ఆపై కట్టుకథలు అల్లాడు. ఎంతకీ వారు వినిపించుకోకపోవడంతో గుడిపాల పోలీసులకు తెలియజేశారు. కాగా కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
మంగళవారం పంచాయితీ..
వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకు..
గ్యాంగ్ లీడర్ హైజాక్ విషయం బుధవారం సాయంత్రానికి గుడిపాల మొత్తం కంపు కొట్టింది. దీంతో ఓ నగరపాలక ప్రజాప్రతినిధి.. ఐడియా ప్రకారం వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు ప్లాన్ చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా కొందరు వ్యక్తులను పార్టీకి అంటగడుతూ.. కేసును మళ్లించే ప్రయత్నం చేశారు. ఇంతలో దీనికి దీటుగా వైఎస్సార్సీపీ అదే సామాజిక మాధ్యంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. అసలైనా వ్యక్తి.. గ్యాంగ్లీడర్ను సామాజిక మాధ్యమం వేదికగా బయటపెట్టింది. దీంతో బుదర జల్లాలి అనుకున్న పచ్చ బ్యాచ్కు ఎదురుదెబ్బ తగిలింది.
అక్రమార్జనే ధ్యేయం
టీడీపీ చిత్తూరు తెలుగు యువత నాయకుడికి పదవి పొందిన నాటినుంచి అక్రమార్జనే ధ్యేయంగా దందాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గుట్కా హైజాక్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు గుట్కా, డ్రగ్స్ అక్రమ రవాణాను కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం సీనియర్ నాయకులు అతనికి పదవి ఇవ్వకూడదని చెప్పినా ఓ ప్రజాప్రతినిధి మాత్రం పట్టించుకోకుండా పదవి కట్టబెట్టడంతో తెలుగుదేశం పార్టీలో అక్రమ రవాణాకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది.
సోమవారం రాత్రి జరిగిన సంఘటనను గుడిపాల మండలంలోని టీడీపీ నాయకులు పలువురు ఈ విషయాన్ని ఓ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాలను పిలిచి ఈ విషయం బయటికి పొక్కకుండా చేశారు. సర్దుబాటు చేయకపోతే పార్టీ పరువుపోతుందని భావించారు. ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఇదంతా చేయించడంటే వారికి దెబ్బపడుతుందని అనుకున్నారు. దీంతో విషయం బయటకురాకుండా తొలుత కేసు నమోదు చేయమని ఆ ప్రజాప్రతినిధే పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తర్వాత ఆ కేసు లేకుండా చూసేందుక పలు పంచాయితీలు నడిచాయి. తీరా పార్టీ నుంచి కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి టీడీపీలోని కొందరు గ్యాంగ్ లీడర్ విషయాన్ని అధిష్టానానికి పూసగుచ్చినట్లు వివరించారు. మరో రెండు రోజుల్లో గ్యాంగ్పై కేసు నమోదు చేయడంతో పాటు ఆ గ్యాంగ్ లీడర్ను పార్టీ నుంచి తొలిగించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.


