9న జిల్లాకు డెప్యూటీ సీఎం రాక
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 9న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి కలెక్టరేట్కు ఉత్తర్వులు అందాయి. ఆ ఉత్తర్వుల మేరకు ఆయన 9వ తేదీన ఉదయం 10.35 గంటలకు పలమనేరు మండలం, పెంగరగుంట హెలిప్యాడ్కు చేరుకుంటారు. 10.40కి అక్కడి నుంచి బయలుదేరి సమీపంలోని ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ వద్దకు విచ్చేస్తారు. 10.50 నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంపులో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45కు అక్కడ నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా, రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారని ఉత్తుర్వుల్లో పేర్కొన్నారు.
సిగరెట్ గోడౌన్లో అగ్నిప్రమాదం
పుత్తూరు: స్థానిక కాపువీధిలోని ఐటీసీ సిగరెట్ గోడౌన్లో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్లో నుంచి పొగను గుర్తించిన స్థానికులు యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. యజమాని రాఘవ గుప్తా ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. అప్పటికే సిగరెట్లు, చాక్లెట్లు పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతైనట్లు బాధితుడు వాపోయాడు. సుమారు రూ.10 లక్షల సరుకు కాలిపోయిందని తెలిపారు. దీనిపై అగ్నిమాపక అధికారులు ఆస్తి నష్ట వివరాలను సేకరిస్తున్నారు.
విద్యుత్ షాక్తో మహిళకు గాయాలు
గుడిపాల: విద్యుత్షాక్తో ఓ మహిళకు గాయాలయ్యాయి. చిత్తపార గ్రామానికి చెందిన వనజ(55) అనే మహిళ గురువారం ఉదయం పాడి ఆవుల దొడ్డిలో పాలు పితికేందుకు వెళ్లింది. అక్కడ ఆమె విద్యుత్షాక్కు గురవ్వడంతో గాయాల పాలైంది. 108 వాహనంలో సిబ్బంది చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలి
ఐరాల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ చైర్పర్సన్ను నియమించాలని, అలాగే మధ్యంతర భృతి(ఐఆర్) 30 శాతాన్ని ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పొలకల, నాంపల్లె, బీరప్పచెరువు, ఐరాల, ఎం.పైపల్లె, అగరంపల్లె జెడ్పీ హైస్కూల్ల్లో రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మోహన్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు ఉన్న సుమారు రూ.35 వేల కోట్లు దశలవారీగా మంజూరు చేయాలని, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్ సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు పురుషోత్తం మాట్లాడుతూ 11వ పీఆర్సీ బకాయులు, పెండింగ్లో ఉన్న డీఏలు, ఏపీజీఐల్, పీఎఫ్ బకాయిలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీయూ నాయకులు కిషోర్కుమార్రెడ్డి, హరినాథ్రెడ్డి, సుధాకర్, గుణశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
9న జిల్లాకు డెప్యూటీ సీఎం రాక
9న జిల్లాకు డెప్యూటీ సీఎం రాక


