వచ్చామా....వెళ్లామా అనే ధోరణితో ముగిసిన వైనం ప్రజా సమస్యలు పట్టని ప్రజా ప్రతినిధులు మొక్కుబడిగా జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశాలను మొక్కుబడిగా మార్చేశారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనప్పుడల్లా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వెల్లడిస్తున్నా జిల్లా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపణలు గుప్పించారు. క్షుణ్ణంగా నిర్వహించాల్సిన 1 నుంచి 7 స్థాయీ సంఘాల సమావేశాలు మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించి మమ అనిపించేశారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ సమావేశాలకు చిత్తూరు, తిరుపతి, అన్న మయ్య జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు. ప్రతి సమావేశానికి పూర్తి స్థాయిలో అధికారులు గైర్హాజరవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. ఇలాంటి స్థాయి లేని సమావేశాలను నిర్వహించి ఎలాంటి లాభమూ లేదని జెడ్పీటీసీలు నిట్టూర్చారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, 5 వ స్థాయి సంఘం చైర్పర్సన్ భారతి, జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై దృష్టిసారించండి
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయన్నా రు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ పాఠశాలల బలోపేతం కోసం నిర్వహించిన నాడు–నేడు పనుల నిధులు చాలా పాఠశాలల ఖాతాల్లో ఉన్నాయన్నారు. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా నిబంధనల మేరకు ఖర్చు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
హాజరుకాని కూటమి ఎమ్మెల్యేలు
జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరు కావాల్సిన కూటమి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టా రు. అదే విధంగా తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి పలు శాఖల జిల్లా అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపారు. దీంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు సిబ్బంది సమా ధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. బాధ్యతగా హాజరు కావాల్సిన జిల్లా అధికారులు గైర్హాజరు కావడంతో సభ్యులు విమర్శలు గుప్పించారు. ప్రతిసారి ఏదో ఒక సాకుతో గైర్హా జరవుతున్న జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరయ్యే ప్రజల సమస్యలను చర్చించాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా హాజరు కాకపోవడంపై విమర్శలు గుప్పించారు.
చర్చించిన సమస్యలు ఇలా.....
కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్ని స్తున్నారని, ఎందుకు మంజూరు చేయడంలేదని సదుం జెడ్పీటీసీ సోమశేఖరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్లో గ్రామా ల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోయారు. బిల్లులు అప్లోడ్ చేసేందుకు చిత్తూరు జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇస్తే తిరుపతి జిల్లాలో మాత్రం మార్చి 6వ తేదీ వరకు సమయం ఇవ్వడం ఏమిటని డ్వామా అధికారులను ప్రశ్నించారు.
గ్రామాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నా యని వాటిని పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ లకు రైతులు నెలల తరబడి నిరీక్షిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
అన్నమయ్య జిల్లా పీలేరులో 50కి పైగా ఆసుపత్రులు ఉంటే కొత్తగా ఏర్పాటు చేసిన అశ్విని ఆసుపత్రిని మాత్రం అన్నమయ్య వైద్యశాఖ అధికారులు లంచం కోసం సీజ్ చేశారని పీలేరు జెడ్పీటీసీ రత్నశేఖర్ ఆరోపించారు.
జగనన్న కాలనీ ఏర్పాటుకు భూమి చదును చేసి ఎర్రమట్టి పోసి ప్లాట్లు కేటాయించగా, అందుకు ఖర్చు చేసిన నిధులను అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ ఆరోపించారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద విడుదల చేసిన నోటిఫికేషన్ అనుమతి లేకుండా విడుదల చేశారనే ఆరోపణలున్నట్లు గుడుపల్లి జెడ్పీటీసీ కృష్ణమూర్తి అన్నారు. ఇలా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆరోపించారు.
విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న బడుల ను మూసివేయడం దారుణమని సభ్యులు మండిపడ్డారు. ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి ఎదురవుతోందని సదుం జెడ్పీటీసీ సోమ శేఖర్రెడ్డి విమర్శించారు. సదుం మండలంలో ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తామన్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు ఎలాంటి అటెండెన్స్ లేకుండా నష్టపోతున్నారని చెప్పారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థులను తీసుకెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
అలా ముగించేశారు!