
సర్కారుకు షాక్ తప్పదు
ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట మహాధర్నా
ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని మండిపాటు
13న చలో విజయవాడకు పిలుపు
15 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరిక
తిరుపతి రూరల్ : విద్యుత్ శాఖలో సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు రోడ్డెక్కారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. తిరుపతి డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు కూటమి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయాస్ సంఘాల సమాఖ్య (జేఏసీ) తిరుపతి డిస్కమ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం గ్రేడ్–2 కింద నియమితులైన కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. డిస్కమ్ కో–చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ యాజమాన్యం అనుసరించే అశాసీ్త్రయ విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు నష్టం వస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి యాజమాన్యాలు తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. డిస్కమ్ కన్వీనర్ మురళీధర్ మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తూ దూర విద్య కళాశాలల్లో ఉన్నత చదువులు చదివి అర్హత సాధించిన వారికి ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లడించారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయరాం మాట్లాడుతూ ఉద్యోగులపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయమణి మాట్లాడుతూ జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు వారికి విధించిన కొత్త సర్వీసు రెగ్యులేషన్స్ను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశార9ఉ. తిరుపతి సర్కిల్ జేఏసీ చైర్మన్ వెలకటూరి గోపి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్ ఉప కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు
మోసానికి నిరసనగానే..
కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఉద్యోగులను మోసం చేసినందుకు నిరసనగానే ఈనెల 13న చలో విజయవాడ చేపడుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి కూడా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పందించకుంటే ఈనెల 15 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు ఎల్.చలపతి, వై.వెంకట సునీల్, వి.సతీష్, టి.రవికుమార్, సురేష్,రియాజ్ అహ్మద్, రామలింగారెడ్డి, సంజీవరావు, కృష్ణయ్య , తిరుపాల్ రెడ్డి ,రంగయ్య ,హుస్సేనయ్య , శంకర్, బాలకాశి, నాగార్జున, సుధాకర్, ఏలుమలై పాల్గొన్నారు.