
అందుబాటులో స్కానింగ్ మిషన్లు
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో బుధవారం భక్తులు విరాళాలు సమర్పించేందుకు స్కానింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. యూనియన్ బ్యాంకు సౌజన్యంతో అందజేసిన ఈ మూడు మిషన్లను ప్రారంభించారు. నిత్య అన్నదానం, గోసంరక్షణ, ఆలయ అభివృద్ధికి విరాళాలు సమర్పించే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, బ్యాంకు జీఎం శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు.
అక్రమ స్కానింగ్.. మొక్కుబడి విచారణ !
కాణిపాకం : మూడు నెలలకు కిందట చిత్తూరు నగరంలో పట్టుబడ్డ అక్రమ స్కానింగ్ కేసులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హస్తం ఉందని తేలింది. అతడిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నాన్చుతూ వచ్చారు. ఈ జాప్యం విమర్శలకు దారితీసింది. కాసులకు అమ్ముడుబోయి..మిన్నుకుండిపోయారని ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై సాక్షి దినపత్రికలో అక్రమ గుట్టురట్టుపై చర్యలేవీ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఓ డాక్టర్కు విచారణ బాధ్యతలను అప్పగించారు. మంగళవారం ఆ డాక్టర్ విచారణకు వెళ్లారు. అయితే ఈ విచారణ తూతూమంత్రంగా సాగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస అవగాహన లేని డాక్టర్కు విచారణ బాధ్యతలు అప్పగించడం ఏమిటని సొంత శాఖలోని అధికారులే పెదవి విరుస్తున్నారు. ఇదంతా అక్రమార్కులను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ పట్టుకున్న కేసులోనే ఈ రకంగా జాప్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : డీఆర్డీఏ ఏపీఎం, సీసీలు విధుల పట్ల అలసత్వం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బ్యాంక్ లింకేజ్, మైక్రో క్రెడిట్ యాన్యూవల్ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మొక్కలు నాటే ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో సీ్త్ర నిధికి రూ.346 కోట్ల రుణాలు, ఉన్నతిలో రూ.20 కోట్లు, సామాజిక పెట్టుబడి నిధి రూ.6 కోట్లు నిధులను అర్హులకు అందజేయడం జరుగుతోందన్నారు. డీఆర్డీఏ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తులు వేచి ఉన్న క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,634 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,980 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారికి క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

అందుబాటులో స్కానింగ్ మిషన్లు

అందుబాటులో స్కానింగ్ మిషన్లు