
కూటమి నిర్లక్ష్యం.. దళితులకు శాపం
వారికి అన్యాయం జరిగితేఊరుకునేది లేదు తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు దేవళంపేటలో వైఎస్సార్సీపీ నేతల ధర్నా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
‘దళిత జాతికి ఎక్కడ అవమానం జరిగితే అక్కడ వాలిపోతాం. వారికి అండగా నిలబడతాం. కూటమి పాలనలో దళితులకు సముచిత స్థానం దక్కడం లేదు. వారిని చిన్నచూపు చూడడం.. అవహేళన చేయడం రివాజుగా మారుతోంది. దళితుల దేవుడు, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను కూల్చడం, పెట్రోలు పోసి నిప్పు పెట్టడం లాంటి వికృత చేష్టలకు పూనుకుంటున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదు. దోషులను వదలి.. మాపై నిందలు వేస్తే ఊరుకునేది లేదు..’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. వెదురుకుప్పం మండలంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి నిప్పుపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దేవళంపేటలో దళితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతల ధర్నా
అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు
వెదురుకుప్పం: ‘పేదల పక్షాన నిలబడతాం.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి అమాయకులపై అన్యాయంగా కేసులు పెడితే ఊరుకునేది లేదు’ అని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశా రు. శనివారం మండలంలోని దేవళంపేటలో అంబే డ్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. దోషు లను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
కేసుల నుంచి తప్పించే కుట్ర
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన కూటమి నాయకులను కేసుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్కు అవమానం జరిగితే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో దేవళంపేటలో సర్పంచ్ గోవిందయ్య అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. అయితే ఘటన తర్వాత అప్పట్లో వేసిన శిలాఫలకాన్ని తొలగించడం దారుణమన్నారు. న్యాయం చేయాలని ప్రాదేయ పడిన సర్పంచ్ గోవిందయ్యను నిర్బంధించి ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు.
కూటమి అరాచకాలకు హద్దుల్లేవ్
చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ విగ్రహాన్ని తగలబెట్టిన వారిని దోషులుగా నిలబెట్టాలని కోరారు. చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అరాచకాలకు హద్దుల్లేవన్నారు. వాళ్లు తప్పులు చేసి ఆ నెపాన్ని తమపై నెడుతూ సునకానందం పొందుతున్నారన్నారు. గంగాధరనెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. దళితులనే చులకన భావంతో రెచ్చిపోతూ అవమానవీయంగా ప్రవర్తిస్తున్న టీడీపీ నాయకుడు సతీష్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి రామయ్య, బూత్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, మాజీ ఎంపీపీ పురుషోత్తం, వైద్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, నాయకులు నరసింహారెడ్డి, జగదీష్రెడ్డి, అమర్నాద్ తోపాటు కార్వేటినగరం, పెనుమూరు, శ్రీరంగరాజపురం మండలాల నాయకులు పాల్గొన్నారు.
దళిత జాతికి అవమానమా.. సిగ్గుసిగ్గు
ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
దేవళంపేటకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్లప్రసాద్, ఎమ్మెల్యే జగన్మోహన్ వచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన ఘటనపై ఆరాతీశారు.
బంగారుపాళెం: దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహ దహన ఘటనపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దళితుల ఆత్మగౌరవంపై దాడి చేయడమేనన్నారు. ఈ ఘటనను టీడీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా నింధితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో అసహనానికి గురిచేస్తోందన్నారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలన్నారు. దళితజాతి మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని హెచ్చరించారు.

కూటమి నిర్లక్ష్యం.. దళితులకు శాపం

కూటమి నిర్లక్ష్యం.. దళితులకు శాపం

కూటమి నిర్లక్ష్యం.. దళితులకు శాపం