
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల(కల్లూరు): పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. తాజాగా సోమవారం తెల్లారు జామున ఏనుగులు మండలంలోని కల్లూరు, తలారివారిపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను తొక్కిపాడేశాయి. కల్లూరుకు చెందిన రఫీ మామిడి చెట్లు, తలారివారిపల్లెకు చెందిన కోదండ పొలంలోని కొబ్బరి చెట్లు, జామ, మామిడి పంట, ధనుంజేయకు చెందిన డ్రిప్పైపులు, బోరు, మల్లికార్జునకు చెందిన మామిడి చెట్లను విరిచేశాయి. దాదాపు 13 ఏనుగుల గుంపు పంటలను నష్టపరిచినట్టు రైతులు పేర్కొన్నారు. పగటి పూట సమీప పెద్దవంక, గోగులమ్మ వంకల్లో ఉండి రాత్రి పూట పొలాలపై దాడిచేస్తున్నట్టు వాపోయారు. అట వీ అధికారులు స్పందించి ఏనుగుల కట్టడికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
చెక్డ్యాం కూల్చివేత
రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలంలోని చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ, గురికివారిపల్లె సమీపంలో భూగర్భ జలాల అభివృద్ధి కోసం నిర్మించిన చెక్డ్యాంను కొందరు కూల్చి వేశారు. 2018–19లో ఉపాధి పథకంలో రూ. 5 లక్షల వ్యయంతో వంకలో ఈ చెక్ డ్యాంను నిర్మించారు. అయితే గత వారం క్రితం జేసీబీతో చెక్డ్యాంను కూల్చి వేశారు. వర్షం కురిసిన నీరు చెక్ డ్యాంలో నిలిచే పరిస్థితి లేదు. ఈ విషయమై ఎంపీడీవో, తహసీల్దార్, ఉపాధి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతు దొరబాబునాయుడు తెలిపారు. ఇప్పుటికై నా అఽధికారులు తగు చర్యలు తీసుకుని, చెక్ డ్యాం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పోలీసు గ్రీవెన్స్కు 36 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 36 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ రాంబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టండి
చిత్తూరు కార్పొరేషన్: హోంమంత్రి అనిత మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి సూచించారు. జగనన్న మీద అవాకులు, చవాకులు మాట్లాడడానికి మాత్రమే ఆమె ఎక్కువగా మీడియా ముందుకు వస్తారన్నారు. ఇటీవల ఆమె మెడికల్ కళాశాలల పై నిర్వహించిన ప్రెజెంటేషన్తో కూటమి ప్రభుత్వ అసమర్థత బయటపడిందన్నారు. 15 నెలల్లో కనీసం రూ.15 కోట్లు కూడా మెడికల్ కాలేజీల నిర్మాణానికి పెట్టలేదని దుయ్యబట్టారు. పీపీపీలపై కొత్త వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,893 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,604 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.

ఆగని ఏనుగుల దాడులు

ఆగని ఏనుగుల దాడులు