
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ మృతి
పుత్తూరు: మండల పరిధిలోని పరమేశ్వరమంగళం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్ మృతి చెందాడు. సీఐ శేఖర్రెడ్డి కథ నం మేరకు.. తమిళ నాడు రాష్ట్రం అరక్కోణం వద్ద కిజ్కుప్పం గ్రామానికి గజేంద్ర అడియార్ రెండో కుమారుడు జి.సంతోష్కుమార్(34) రేణిగుంట వద్ద గల న్యూలింక్ కంపెనీలో ఇంజినీర్. రెండు రోజుల పాటు కంపెనీకి సెలవు రావడంతో శుక్రవారం రాత్రి పనిముగించుకొని టూ వీలర్పై అరక్కోణంకు బయలు దేరాడు. రాత్రి 9 గంటల సమయంలో పరమేశ్వరమంగళం గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ దారితప్పి వెళ్తున్నామని గుర్తించి డ్రైవర్ ఒక్కసారిగా యుటర్న్ తీసుకున్నాడు. టూ వీలర్పై వెళ్తున్న సంతోష్కుమార్ అదుపు తప్పి లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో సంతోష్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వయస్సుకు వచ్చిన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి సంబంధాలు చూస్తున్న వేళ మృత్యువాత పడడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. లారీ డ్రైవర్ను అదులోకి తీసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వం విద్యాసంస్థలకు జాతీయ పురస్కారం
తిరుపతి సిటీ : విశ్వం సైనిక్ నవోదయ కోచింగ్ ఇన్స్టిట్యూట్కు ‘బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇయర్–25’ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం బెంగుళూరు వేదికగా జరిగిన భారతీయ శిక్షణ రత్న అవార్డులు–2025 కార్యక్రమంలో భాగంగా ఈ వార్డును ఆ సంస్థ ప్రతినిధులు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంతోష్ హెగ్డే, ప్రముఖ విద్యావేత్త రంజన రజోర శర్మ చేతుల మీదుగా విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్. విశ్వచందన్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటక మంత్రి హెచ్ ఆంజనేయ, ఆధ్యాత్మిక నాయకులు డాక్టర్ మలయ శాంతముని, నటుడు చేతన్ కుమార్ పాల్గొని విశ్వం విద్యా సంస్థలకు అభినందనలు తెలిపారు.
డాక్టర్ల దాడిపై కేసు నమోదు
చిత్తూరుఅర్బన్: జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పీజీ డాక్టర్ల దాడిపై టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి పీజీ వైద్యులపై కొందరు విద్యార్థులు, వారి స్నేహితులు దాడి చేశారు. దీనిపై బాధిత డాక్టర్లు రక్షిత్, సరన్, యోగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన మొగిలేశ్వర్, షరీఫ్, లోకేష్, యశ్వంత్, వినేష్, సందీప్పై కేసు నమోదు చేసినట్లు సీఐ నెట్టికంఠయ్య వెల్లడించారు.
కూరగాయల వితరణ
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి ఓ దాత ఆదివారం పలు రకాల కూరగాయలను వితరణగా అందజేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకట్రెడ్డి సుమారు 2.5 టన్నుల కూరగాయలను అందించారు. కార్యక్రమంలో అన్నదాన సూపరింటెండెంట్ బాలరంగస్వామి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ మృతి