
ఒప్పించి కాదు నొప్పించి!
● అయ్యోర్లను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
● బదిలీలు, ఉద్యోగోన్నతుల సమస్యలను పరిగణనలోకి తీసుకోని వైనం
● 21న ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయం ముట్టడికి పిలుపు
చిత్తూరు కలెక్టరేట్ : అధికారంలోకి రాక ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాటను అమలు చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికలకు ముందు టీచర్లకు అనేక హామీలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలు విషయం దేవుడెరుగు.. క్షేత్ర స్థాయిలో టీచర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించకుండా చుక్కలు చూపిస్తోంది. త్వరలో నిర్వహించే ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అన్యాయం చేస్తోంది. దీనిపై ఉపాధ్యాయ లోకం నిప్పులు చెరుగుతోంది.
ఏకపక్ష జీవోలు సరికాదు
కూటమి ప్రభుత్వం ఏక పక్షంగా తీసుకొస్తున్న జీవోలను టీచర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గత 30 వారాలుగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన యూనియన్లతో సమావేశాలు నిర్వహించి డిమాండ్లను సేకరించినప్పటికీ అమల్లోకి తీసుకొకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా అమల్లోకి తీసుకొచ్చిన 19, 20, 21 జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు తేల్చిచెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలను ఒప్పించి చేస్తున్నామంటూ అపోహలు సృష్టించి.. నొప్పించే ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు.
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 21న ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. కూటమిపై పోరాటానికి అన్ని సంఘాలు కలిసి వచ్చినట్టు పేర్కొన్నాయి.
డిమాండ్లను పరిష్కరించాలి
డిమాండ్లను తప్పనిసరిగా పరిష్కరించాల్సిందే. టీచర్లకు అన్యాయం చేస్తే సహించేది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖలో నెలకున్న సమస్యలు, ఇబ్బందులను గుర్తించి తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలి. – గిరిప్రసాద్రెడ్డి,
పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తాం
విద్యాశాఖ అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న ఉమ్మడి చిత్తూరు జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నాం. కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరుస్తోంది.
– జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
తీరని అన్యాయం
సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం టీచర్లకు తీరని అన్యాయం చేస్తోంది. సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. టీచర్ల పట్ల అంత అలుసు ఎందుకు చూపుతున్నారో.
– రెడ్డిశేఖర్రెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర ట్రెజరర్.
డిమాండ్లు ఇవే
ఉన్నత పాఠశాలల్లో 1:30 నిష్పత్తి ప్రకారం 45 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ప్రతి 40 మందికి మరో సెక్షన్ను ఏర్పాటు చేయాలి.
మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాసీ్త్రయం.
బదిలీల్లో స్టడీ సెలవులో ఉన్న టీచర్ల స్థానాలను ఖాళీగా చూపరాదు.
ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో 41 వద్ద 3వ పోస్టు ఇవ్వాలి. ఏప్రిల్ 23వ తేదీ రోల్ను పరిగణనలోకి తీసుకోవాలి.
పోస్టులను బ్లాక్ చేస్తుండడం సరైన పద్ధతి కాదు.
2023లో రేషనలైజేషన్ చేసి 2023లో ఉద్యోగోన్నతి పొంది 2025లో రేషనలైజేషన్ అవుతున్న టీచర్లకు బదిలీల్లో అన్యాయం జరుగుతోంది. అటువంటి వారికి బదిలీల్లో 8 సంవత్సరాల పాయింట్లు కేటాయించాలి.
పీహెచ్సీ కోటా టీచర్లను రేషనలైజేషన్ చేయడం సరైన పద్ధతి కాదు.
ప్రభుత్వ, పంచాయతీరాజ్ సర్వీస్ రూల్స్ సమస్య తేలకుండా 8 ఏళ్లుగా లాంగ్ స్టాండింగ్ అయిన టీచర్లను సొంత యాజమాన్యానికి వెళ్లమని చెప్పడం భావ్యం కాదు.
ఎంఈవోలకు బదిలీలు నిర్వహించి కోరుకున్న ఎంఈఓ 1, ఎంఈవో 2లకు హెచ్ఎం కన్వర్షన్ ఇవ్వాలి.
ఎందుకు మోసగిస్తున్నారు
డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటున్నామంటూ టీచర్లను ఎందుకు మోసగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. టీచర్లకు బదిలీల్లో, ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగితే సహించేది లేదు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా ఒక్కటయ్యాం. పోరాటాలకు సిద్ధమవుతున్నాం.
– బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు

ఒప్పించి కాదు నొప్పించి!

ఒప్పించి కాదు నొప్పించి!

ఒప్పించి కాదు నొప్పించి!

ఒప్పించి కాదు నొప్పించి!