మరింత మంది మహిళలు ఉద్యోగాల్లోకి చేరుతున్న నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రణాళికల ఆవశ్యకత నెలకొందని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్) సభ్యులు రుషభ్ గాంధీ, పరాగ్ రాజా తెలిపారు. కుటుంబ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు వారు తాత్కాలికంగా గానీ శాశ్వతంగా గానీ ఉద్యోగాలకు దూరం కావడం వల్ల పొదుపు, రిటైర్మెంట్ నిధిపై ప్రభావం పడుతుందన్నారు.
పురుషులతో పోలిస్తే మహిళల జీవితకాలం సగటున నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి తమతో పాటు తమపై ఆధారపడే వారి కోసం కూడా దీర్ఘకాలికమైన, మెరుగైన పొదుపు ప్రణాళికలు అవసరమవుతాయని తెలిపారు. ఆదాయార్జన వ్యవధి తక్కువగా ఉండటం, జీవితకాలం అధికంగా ఉండటమనేది మహిళలు ఎదుర్కొనే విశిష్టమైన సవాలని వివరించారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక అక్షరాస్యత దన్నుతో వారు ఆర్థిక ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. యాన్యుటీలు, గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్లు వారు స్థిరమైన ఆదాయాన్ని అందుకునేందుకు తోడ్పడతాయని వారు చెప్పారు. తమ ఆర్థిక ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు బీమా పరిశ్రమ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు


