గత ఆర్థిక సంవత్సరంలో నమోదు
పదేళ్లలో 4,000 రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రికార్డు స్థాయికి చేరాయి. రూ. 314 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2016–17లో కేవలం రూ. 0.07 లక్షల కోట్లుగా ఉన్న ఈ విలువ, పదేళ్లలో 4,000 రెట్లు పెరగడం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
→ 2016–17లో 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2025–26లో 24,162 కోట్లకు పెరిగాయి.
→ 2025 ఆగస్టులో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,000 కోట్ల సంఖ్యను దాటాయి. 2025 డిసెంబర్లో గరిష్టంగా 2,163 కోట్ల లావాదేవీలు జరిగాయి.
→ 2025 క్యాలెండర్ ఇయర్లో రోజుకు సగటున 60 కోట్ల లావాదేవీలు నమోదవగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 66 కోట్లు దాటింది.
→ ప్రారంభంలో యూపీఐ నెట్వర్క్ పరిధిలో 44 బ్యాంకులు మాత్రమే ఉండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 703 బ్యాంకులకు చేరింది.
→ ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ చెల్లింపుల్లో 49 శాతం వాటా యూపీఐదేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం తన 2025 నివేదికలో పేర్కొనడం గమనార్హం.


