
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో ప్రయాణికులకు ఊరట కలగనుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు లేదా క్యాన్సిల్ చేసినప్పుడు ప్రయాణికులకు ఛార్జీలను రీఫండ్ చేసేటప్పుడు కోత విధించే 'క్లరికేజ్' (క్లరికల్ ఛార్జీలు)ను తగ్గించడం లేదా మాఫీ చేసే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది.
ప్రస్తుతం రిజర్వ్డ్ ఏసీ, నాన్ ఏసీ టికెట్లకు రూ.60, అన్రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ టికెట్లకు రూ.30 వాటిని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు క్లరికల్ ఛార్జీల కింద మినిహాయించుకుని మిగిలిన మొత్తం రీఫండ్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా క్యాన్సిల్ చేసిన టికెట్లతో సహా అన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నప్పుడూ ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
దీనిపై ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. రైల్వే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే టికెట్ క్యాన్సిల్చేసుకునే ప్రయాణికులకు ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ఉన్న ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇందులో వారి ప్రమేయం ఏ మాత్రం ఉండకపోయినా చార్జీలు పూర్తిగా రీఫండ్ కాకుండా క్లరికేజ్ రూపంలో రైల్వే కోత విధిస్తోంది.
ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు కౌంటర్ల నుండి కాకుండా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడంతో టికెటింగ్ కోసం రైల్వే నిర్వహణ ఖర్చులు తగ్గాయని, దీన్ని పరిగణనలోకి తీసుకొని ఛార్జీలను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రైల్వే వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు రైల్వేకు చెందిన టికెటింగ్ అండ్ క్యాటరింగ్ విభాగమైన ఐఆర్టీసీ ఏసీ టికెట్లపై రూ.30, నాన్ ఏసీ టికెట్లపై రూ.15 కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తోంది. కానీ టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు క్లరికేజ్ ఆదాయం మొత్తం రైల్వేకు వెళ్తోంది.