రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు! | Subhash Chandra NCLT Rs 6 5 Crore Repayment Rs 22006 Crore Claims | Sakshi
Sakshi News home page

రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు!

Aug 27 2026 6:10 PM | Updated on Aug 27 2026 6:16 PM

Subhash Chandra NCLT Rs 6 5 Crore Repayment Rs 22006 Crore Claims

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ మాజీ అధినేత సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు, రుణ సంస్థలకు బకాయి ఉన్న రూ.22,006.57 కోట్ల మేర రుణాలకు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకునే రీపేమెంట్ ప్లాన్‌ను ట్రిబ్యునల్ ఆమోదించింది. దీంతో రుణదాతలు దాదాపు 99.97 శాతం నష్టపోవాల్సి వస్తోంది. అంటే క్లెయిమ్ చేసిన ప్రతి రూ.100కు సుమారు 3 పైసలు మాత్రమే తిరిగి వచ్చే పరిస్థితి.

అందరూ ఒప్పుకొన్నారు కానీ..

సుభాష్ చంద్ర ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్‌కు 2024 నవంబర్‌లో జరిగిన రుణదాతల ఓటింగ్‌లో 80.814 శాతం ఓటింగ్ షేర్ మద్దతు లభించింది. అయితే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర సంస్థలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. వ్యతిరేకించిన రుణదాతల ఓటింగ్ వాటా మాత్రం 20 శాతం కంటే తక్కువగా ఉంది.

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు ఎంత రావాలి?

ఈ వ్యవహారం​లో అత్యంత నష్టపోతోంది ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. ఈ సంస్థకు సుమారు రూ.1,322.39 కోట్ల ఆమోదిత క్లెయిమ్ ఉండగా, రీపేమెంట్ ప్లాన్ ప్రకారం దానికి అందేది కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే. అంటే దాని క్లెయిమ్‌లో దాదాపు 0.028 శాతం మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రతిపాదనను సంస్ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.

ప్లాన్‌ను ఎన్‌సీఎల్‌టీ ఎందుకు ఆమోదించింది?

ఈ కేసులో మొదటి ఇద్దరు ఎన్‌సీఎల్‌టీ సభ్యుల మధ్య విభేదాలు రావడంతో విషయం మూడో సభ్యుడు నీలేశ్ శర్మ వద్దకు వెళ్లింది. ఆయన ఐబీసీలోని సెక్షన్ 114 కింద రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. రుణదాతలు మెజారిటీతో తీసుకున్న వాణిజ్య నిర్ణయాన్ని, అది చట్టపరమైన నిబంధనల పరిధిలో ఉన్నంత వరకు, ట్రిబ్యునల్ తన సొంత అంచనాతో భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

ట్రిబ్యునల్ పరిశీలనలో మరో కీలక అంశం సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ. రీపేమెంట్ ప్లాన్‌లో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే ఆయన ఆస్తుల నుంచి వచ్చే రికవరీ పరిమితంగానే ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. ప్లాన్‌ను తిరస్కరించి చంద్రను దివాలా ప్రక్రియలోకి నెట్టడం వల్ల రుణదాతలకు మరింత తక్కువ మొత్తమే దక్కే అవకాశం ఉందని కూడా ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.

నాకు మాత్రం అన్యాయం: విజయ్‌ మాల్యా

సుభాష్‌ చంద్ర రుణాల రీపేమెంట్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం వార్తలపై వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా స్పందించారు. అదే నిజమైతే సుభాష్‌ చంద్రకు అభినందనలు అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి.. దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా.. రూ.6203 కోట్ల బకాయిలకు గానూ  బ్యాంకులు, ప్రభుత్వం తన దగ్గర నుంచి 14,100 కోట్లు వసూలు చేశాయన్నారు. చాలామంది రుణగ్రహీతలు తక్కువ మొత్తాలు చెల్లించి, తమ రుణాలను పరిష్కరించుకుంటున్నారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement