
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలలో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య ఇతర ఆసియా మార్కెట్ల సంకేతాలతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 82,783.5 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 123 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 82,515.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కేవలం 37.15 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 25,141.4 వద్ద ముగిసింది.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.49 శాతం, 0.53 శాతం క్షీణించాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.47 శాతం, ఐటీ 1.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.48 శాతం క్షీణించి 13.66 పాయింట్ల వద్ద స్థిరపడింది.