నేడు వీక్ ఓపెనింగ్?!
ప్రస్తుతం 64 పాయింట్ల నష్టంతో ఎస్జీఎక్స్ నిఫ్టీ
వారాంతాన విదేశీ ఇన్వస్టర్ల భారీ అమ్మకాలు
శుక్రవారం రెండో రోజూ యూఎస్ మార్కెట్లు వీక్
ఆసియా మార్కెట్లలో అధిక శాతం నష్టాల్లో
ఎన్ఎస్ఈ నిఫ్టీకి 11,274-11,215 వద్ద సపోర్ట్స్!
బ్యాంక్ నిఫ్టీకి 22,794-22,576 వద్ద మద్దతు?!
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(7న) మరోసారి బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 64 పాయింట్లు క్షీణించి 11,311 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,375 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా టెక్ దిగ్గజాలలో వెల్లువెత్తిన అమ్మకాలతో వారాంతాన వరుసగా రెండో రోజు యూఎస్ మార్కెట్లు 0.6-1.3 శాతం మధ్య నష్టపోయాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లలో అధిక శాతం ప్రతికూలంగా కదులుతున్నాయి. యూఎస్ మార్కెట్ల పతనం, జీడీపీ క్షీణత, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల నేపథ్యంలో వారాంతాన ఒక్కసారిగా కుప్పకూలిన దేశీ స్టాక్ మార్కెట్లు నేడు మరోసారి ఆటుపోట్లను ఎదుర్కొనే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
నష్టాల సునామీ
యూఎస్ మార్కెట్ల పతనంతో దేశీయంగానూ సెంటిమెంటుకు షాక్ తగిలింది. దీంతో వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయి 38,357 వద్ద నిలవగా.. నిఫ్టీ 194 పాయింట్లు కోల్పోయి 11,337 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,452- 11,304 పాయింట్ల మధ్య గరిష్ట, కనిష్టాలను చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,274 పాయింట్ల వద్ద, తదుపరి 11,215 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,423 పాయింట్ల వద్ద, ఆపై 11,511 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,794 పాయింట్ల వద్ద, తదుపరి 22,576 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,312 పాయింట్ల వద్ద, తదుపరి 23,612 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,889 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 457 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! గురువారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 8 కోట్లు, డీఐఐలు స్వల్పంగా రూ. 120 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి కాగా.. బుధవారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 657 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.