దక్షిణాది మార్కెట్లో ఈసారి రూ. 550 కోట్లు, హైదరాబాద్లో రూ. 50 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఇంటీరియో బై గోద్రెజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ నారాయణ్ సర్కార్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో సుమారు 9 శాతంగా ఉన్న వాటాను వచ్చే మూడేళ్లలో 14 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కొత్త స్టోర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా దాదాపు రూ. 70 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో తమకు 18 షోరూమ్లు, 55 డీలర్లు, 150 రిటైలర్లు ఉన్నట్లు సర్కార్ చెప్పారు. హైదరాబాద్లో స్టోర్స్ సంఖ్య 14కి చేరినట్లు తెలిపారు.
పట్టణ ప్రాంతాలతో పాటు కొత్త మార్కెట్లలోను తమ ఉత్పత్తులను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా ఇరు రాష్ట్రాల్లోను 12 కొత్త డీలర్ స్టోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు 100 రిటైలర్లను జోడించుకోవాలని నిర్దేశించుకున్నట్లు సర్కార్ చెప్పారు. టెక్ ఉద్యోగులు, మౌలిక సదుపాయాలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల వృద్ధితో హైదరాబాద్లో మాడ్యులర్, ఫుల్ హోమ్ సొల్యూషన్స్కి డిమాండ్ నెలకొందని వివరించారు. కర్టెన్లులాంటి సాఫ్ట్ ఫర్నిషింగ్స్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.


