స్వతంత్ర డైరెక్టర్లు బాధ్యతగా మెలగాలి: సెబీ | SEBI Urges Directors Act Responsibly Avoid Baseless Allegations HDFC Bank | Sakshi
Sakshi News home page

స్వతంత్ర డైరెక్టర్లు బాధ్యతగా మెలగాలి: సెబీ

Mar 24 2026 12:16 PM | Updated on Mar 24 2026 12:22 PM

SEBI Urges Directors Act Responsibly Avoid Baseless Allegations HDFC Bank

కార్పొరేట్ గవర్నెన్స్‌లో కీలకమైన స్వతంత్ర డైరెక్టర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించకూడదని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్-టైమ్ ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన సెబీ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పాండే, కంపెనీలలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను కాపాడటం స్వతంత్ర డైరెక్టర్ల ప్రాథమిక విధి అని గుర్తుచేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే వాటిని లేవనెత్తాలని సూచించారు.

గందరగోళానికి తావుండకూడదు

అతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో నైతిక విభేదాల కారణంగా తప్పుకుంటున్నట్లు పేర్కొనడం మార్కెట్‌లో కలకలం రేపింది. ఈ పరిణామంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు భారీగా పతనమవ్వడమే కాకుండా బ్యాంక్ అంతర్గత పరిపాలనపై పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై స్పందిస్తూ ‘సరైన ఆధారాలు, రికార్డులు లేకుండా కేవలం ఊహాగానాలతో కూడిన ఆరోపణలు చేయడం ఎవరికీ తగదు’ అని సెబీ చీఫ్ పేర్కొన్నారు.

ఎల్‌ఓడీఆర్ నిబంధనలే కీలకం

లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్టోజర్‌ రిక్వైర్‌మెంట్స్‌(ఎల్‌ఓడీఆర్‌) నిబంధనలు, కంపెనీల చట్టం కింద స్వతంత్ర డైరెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని పాండే వివరించారు. కంపెనీ పనితీరుపై ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని బోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఆ అంశాలను బోర్డు సమావేశం మినిట్స్ సమావేశంలో తప్పనిసరిగా నమోదు చేయాలని పట్టుబట్టాలి. అనైతిక ప్రవర్తన, మోసాలు లేదా కంపెనీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి అంశాలను అస్పష్టంగా వదిలేయకుండా, అధికారికంగా రికార్డ్ చేయాలని ఆయన సూచించారు.

ఆర్‌బీఐ క్లీన్ చిట్.. సెబీ నిశిత పరిశీలన

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే స్పందించిందని, ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేదని ఆర్‌బీఐ వెల్లడించిన విషయాన్ని పాండే ప్రస్తావించారు. అతాను చక్రవర్తి రాజీనామా లేఖలోని అంశాలను సెబీ లోతుగా పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు తాము బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయబోమని, అయితే నియంత్రణ సంస్థగా తన విధులను సెబీ నిర్వర్తిస్తుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement