న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న రెండు కీలక సంస్థలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెనెరిక్ ఔషధాల తయారీ సంస్థ హిందుస్థాన్ లాబొరేటరీస్, స్టీల్ పైపుల ఉత్పత్తిదారు ఆర్కే స్టీల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి పొందాయి. గతేడాది సెప్టెంబర్లో ఈ సంస్థలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను పరిశీలించిన సెబీ, ఏప్రిల్ 27న తుది అనుమతులు (అబ్జర్వేషన్స్) మంజూరు చేసింది.
హిందుస్థాన్ లాబొరేటరీస్: ఫార్మా రంగంలో సేవలందిస్తున్న హిందుస్థాన్ లా»ొరేటరీస్ ఐపీఓలో భాగంగా 50 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్లు మరో 91 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీఓ ద్వారా లభించే నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ స్థాయిలో జెనెరిక్ మందులను సరఫరా చేసే (బీ2బీ) వ్యాపారంలో కొనసాగుతోంది.
ఆర్కే స్టీల్ మాన్యుఫ్యాక్చరింగ్: స్టీల్ ట్యూబ్లు, పైపుల తయారీలో ఉన్న ఆర్కే స్టీల్ సుమారు 2 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించనుంది. ఈ ఐపీఓలో ప్రమోటర్ల వాటా విక్రయం (ఓఎఫ్ఎస్) ఏమీ లేదు. సేకరించిన నిధులను ప్రధానంగా సంస్థకున్న రుణాల చెల్లింపులకు, మూలధన నిర్వహణ, వ్యాపార విస్తరణ అవసరాలకు కేటాయించనుంది. పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ రెండు కంపెనీల షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో లిస్ట్ కానున్నాయి.


