ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్‌గా 'సతీష్ కుమార్' | Satish Kumar Vaduguri is New Indian Oil Corporation Chairman | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్‌గా 'సతీష్ కుమార్'

Sep 1 2024 9:25 PM | Updated on Sep 1 2024 9:32 PM

Satish Kumar Vaduguri is New Indian Oil Corporation Chairman

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇండియన్ ఆయిల్) చైర్మన్‌గా 'సతీష్ కుమార్ వడుగిరి' ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థకు అధిపతిగా నేడు బాధ్యతలు చేపట్టారు. శనివారం పదవికి రాజీనామా చేసిన ఎస్‌ఎం వైద్య స్థానంలో సతీష్ కుమార్‌ను నియామకమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

2021 అక్టోబరు నుంచి డైరెక్టర్ (మార్కెటింగ్)గా పనిచేస్తున్న సతీష్ కుమార్.. తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తూనే ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈయన 2022 అక్టోబర్ నుంచి ఒక సంవత్సరం పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేశారు.

35 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభివృద్ధికి సతీష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయనకు ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ అయిన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, బహుళజాతి చమురు కంపెనీలతో పనిచేసిన విస్తృత అనుభవం ఉంది.

సతీష్ కుమార్ నాయకత్వంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గత మూడు సంవత్సరాలలో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. సంస్థ తన రిటైల్ అవుట్‌లెట్‌లను ఆధునీకరించింది, కొత్త బాట్లింగ్ ప్లాంట్లు, టెర్మినల్‌లను ప్రారంభించింది. హైవే రిటైల్ ప్రదేశాలలో సౌకర్యాలను ప్రవేశపెట్టింది.

మార్కెటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సతీష్ కుమార్.. మధ్యప్రదేశ్ & ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మార్కెటింగ్ నెట్‌వర్క్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్‌గా పనిచేశారు. తన కెరీర్‌లో LPG వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY), బీఎస్-6 ఫ్యూయల్ ఇంప్లిమెంటేషన్ మొదలైన కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement